Jump to content

update on kavita case


Recommended Posts

Posted

Arvind Kejriwal: నా భర్త నేడు ఆ వివరాలు బయటపెడతారు.. అరవింద్ కేజ్రీవాల్ భార్య సంచలన ప్రకటన 

28-03-2024 Thu 09:54 | National
  • డబ్బుల వివరాలు కేజ్రీవాల్ నేడు కోర్టులో వెల్లడిస్తారని వ్యాఖ్య
  • ఢిల్లీని నాశనం చేయాలని కేంద్రం కోరుకుంటోందని మండిపాటు
  • తన భర్త దేశభక్తుడు, ధైర్యవంతుడంటూ కితాబు
 
He will reveal where the money is says kejriwals wife

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన నేపథ్యంలో ఆయన అర్ధాంగి బుధవారం కీలక ప్రకటన చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను కేజ్రీవాల్ గురువారం కోర్టులో చెబుతారని అన్నారు.   

‘‘మద్యం కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకూ 250 సార్లకు పైగా సోదాలు జరిపింది. ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28న కోర్టులో అన్ని నిజాలు వెల్లడిచేస్తానని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. లిక్కర్ కుంభకోణం డబ్బు ఎక్కడుందో ఆయన న్యాయస్థానంలో చెబుతారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు’’ అని సీఎం అర్ధాంగి తెలిపారు. 

తన భర్త నిజమైన దేశభక్తుడు, ధైర్యవంతుడని సునీత కేజ్రీవాల్ అన్నారు. ‘‘నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల క్రితం మంత్రి ఆతిశీకి లేఖ రాశారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది. ఆయనపై కేసులు పెడుతోంది. ఢిల్లీని నాశనం చేయాలని వారు (కేంద్రం) కోరుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు’’ అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. 

మద్యం విధానం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ ఈ నెల 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కస్టడీ గడువు ముగుస్తుండటంతో అధికారులు ఆయననను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.

Posted

K. Keshava Rao: కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం... ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే 

28-03-2024 Thu 16:49 | Telangana
  • ఇటీవల కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ నేతలు
  • ఈరోజు కేసీఆర్ వద్దకు వెళ్లిన కేకే... వెంట ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ
  • పార్టీ మార్పు గురించి చెప్పడానికి కేకే వెళ్లినట్లుగా ఊహాగానాలు
  • కేసీఆర్ వద్దకు వెళ్లినప్పుడు కేకే చేతిలో పేపర్లు
 
KK meets kcr in Farm house

బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు గురువారం మధ్యాహ్నం పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కలిశారు. ఆయన పార్టీ మారుతారని కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు కేసీఆర్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేకే వెంట ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.

తనకు బీఆర్ఎస్‌లో ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో కేసీఆర్‌ను కలిసి పార్టీ మార్పు అంశంపై చెప్పేందుకు వెళ్లినట్లుగా ప్రచారం సాగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లినప్పుడు ఆయన చేతిలో కొన్ని పేపర్లు ఉన్నాయి. దీంతో ఆయన రాజీనామా సమర్పించేందుకు వెళ్లి ఉంటారనే చర్చ సాగుతోంది. దాదాపు గంటపాటు కేసీఆర్‌తో కేకే భేటీ అయ్యారు.

కేకే తన రాజకీయ భవిష్యత్తుపై నిన్న తన ఫ్యామిలీతో చర్చించినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ తనకు చాలా చేసిందని, రిటైర్మెంట్ వయస్సులో తన సొంత పార్టీ వైపు చూస్తే తప్పేమిటని కేకే వ్యాఖ్యానిస్తున్నారు. కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితోనూ పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మేయర్ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళతారనే ప్రచారం సాగుతోంది.

Posted

KCR: ఫామ్ హౌస్‌కు వచ్చిన కేశవరావుపై కేసీఆర్ తీవ్ర అసహనం? 

28-03-2024 Thu 18:46 | Telangana
  • పార్టీలో మీకు, కూతురుకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పార్టీని ఎందుకు వీడుతున్నారంటూ కేసీఆర్ నిలదీత
  • అధికారం పోగానే పార్టీని వీడుతున్నారని ఆవేదన
  • కేకేతో పాటు పార్టీ వీడుతున్న పలువురు నేతలపై కేసీఆర్ తీవ్ర అసహనం
 
KCR unhappy with party senior leader k keshava rao

బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావుపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కేకే పార్టీ మారనున్నట్లుగా కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లారు. తన కుటుంబం పార్టీ మారనున్నట్లు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని, ఈ సమయంలో కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు.

మీడియా కథనాల మేరకు... పార్టీలో కేకేకు, ఆయన కూతురుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పార్టీని ఎందుకు వీడుతున్నారంటూ కేసీఆర్ నిలదీశారు. పదేళ్ల పాటు పదవులు అనుభవించి ఇప్పుడు అధికారం పోగానే పార్టీని వీడుతున్నారని వాపోయారు. కేకేతో పాటు పార్టీ వీడుతున్న పలువురు ప్రజాప్రతినిధులు, నేతలపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారడానికి గల కారణం కేకే చెబుతుండగా... సాకులు చెప్పవద్దని కేసీఆర్ సూచించినట్టు సనాచారం. దీంతో కేశవరావు మధ్యలోనే బయటకు వచ్చేసినట్టు చెబుతున్నారు.

Posted

K Kavitha: కోర్టు ఆదేశించినా... తీహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదు: కోర్టులో కవిత పిటిషన్

28-03-2024 Thu 22:12 | Telangana
  • మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు తనకు ఉన్నాయన్న కవిత
  • రక్తపోటు సమస్య అధికంగా ఉందని... అందుకే తన విజ్ఞప్తితో కోర్టు తనకు కొన్ని వెసులుబాట్లు కల్పించిందని వెల్లడి
  • ఈ మేరకు జైలు అధికారులకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్న కవిత
  • కోర్టు ఆదేశాలను పాటించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్న కవిత
Kavitha petition in CBI court over tihar jail officials

తనకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ తీహార్ జైలు అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు తనకు ఉన్నాయని, రక్తపోటు సమస్య అధికంగా ఉందని... అందుకే తన విజ్ఞప్తి కారణంగా కోర్టు తనకు కొన్ని వెసులుబాట్లు కల్పించిందన్నారు. ఈ మేరకు జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చిందన్నారు.

తనకు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. పరుపులు ఏర్పాటు చేయలేదని, చెప్పులు కూడా అనుమతించడం లేదన్నారు. బట్టలు, బెడ్ షీట్స్, బుక్స్, బ్లాంకెట్స్‌ను అనుమతించడం లేదని తెలిపారు. పెన్ను, పేపర్లను అందుబాటులో ఉంచడం లేదని, కనీసం కళ్ళజోడును కూడా అనుమతించడం లేదన్నారు. చేతికి వున్న జపమాలను కూడా అనుమతించలేదని ఆరోపించారు.

జైలు అధికారుల తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. తనకు వెసులుబాట్లు కల్పించేలా తీహార్ జైలు సూపరింటిండెంట్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం... శనివారం విచారణ జరుపుతామని తెలిపింది. 

Posted

Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా వ్యాఖ్యలు... మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

28-03-2024 Thu 22:22 | National
  • లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్ట్
  • పారదర్శక విచారణ జరగాలన్న అమెరికా
  • బయటి శక్తుల ప్రమేయాన్ని అంగీకరించబోమన్న భారత్ 
India again condemns US remarks on Kejriwal arrest issue

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే, కేజ్రీవాల్ అరెస్ట్ పై అగ్రరాజ్యం అమెరికా ఇటీవల స్పందిస్తూ, ఈ వ్యవహారంలో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తామని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. 

అయితే, ఇప్పటికే ఓసారి అమెరికా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ మరోసారి స్పందించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ... భారత ఒక బలమైన ప్రజాస్వామ్య దేశం అని, స్వతంత్ర, దృఢమైన ప్రజాస్వామిక సంస్థల విషయంలో భారత్ గర్విస్తోందని తెలిపారు. సదరు సంస్థలను బాహ్య శక్తుల ప్రభావం నుంచి సంరక్షించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. 

భారతదేశ చట్టపరమైన ప్రక్రియలు, ఎన్నికల్లో  బయటి శక్తుల జోక్యం ఎంతమాత్రం ఆమోదయోగ్యంకాదు అని జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికాకు ఈ అంశంపై ఇప్పటికే తీవ్ర నిరసనను వ్యక్తపరిచామని వివరించారు.

Posted

Arvind Kejriwal Arrest: ఈసారి ఐక్యరాజ్య సమితి.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన యూఎన్ 

29-03-2024 Fri 10:47 | National
  • ఎన్నికలు జరిగే ఇండియా లాంటి దేశాల్లో ప్రజల ‘రాజకీయ, పౌర హక్కులు’ రక్షించబడతాయని యూఎన్ ఆశాభావం
  • ‘స్వేచ్ఛగా, న్యాయంగా’ ఓటు వేసే వాతావరణం ఉంటుందని విశ్వాసం
  • ఇలాంటి వ్యాఖ్యలే చేసిన అమెరికాపై భారత్ ఆగ్రహం
 
UN responds on Delhi CM Arvind Kejriwal arrest

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా స్పందించగా, తాజాగా ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఎన్నికలు జరిగే ఇండియా సహా ఇతర దేశాల్లో ప్రజల ‘రాజకీయ, పౌర హక్కులు’ రక్షించబడతాయని బలమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ‘స్వేచ్ఛగా, న్యాయంగా’ ఓటు వేసే వాతావరణం ఉంటుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనతో లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత్‌లో నెలకొన్న ‘రాజకీయ అశాంతి’పై అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. 

ఇవే విషయాలపై అమెరికా కూడా ఇలాగే స్పందించడం గమనార్హం. అమెరికా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్.. తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఘాటుగా హెచ్చరించింది. అంతేకాదు, అమెరికా వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ దేశ రాయబారికి సమన్లు కూడా ఇచ్చింది. మరి ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యలపై భారత్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

Posted

Brs vallu papam kavita ni vadilesaru ga…

Arvind Kejriwal: నా భర్త నిజమైన దేశభక్తుడు: వాట్సాప్ నెంబర్ షేర్ చేసి, మద్దతు కోరిన కేజ్రీవాల్ భార్య సునీత 

29-03-2024 Fri 13:32 | National
  • కేజ్రీవాల్‌ను ఆశీర్వదిస్తున్నామని సందేశాలు పంపించాలని కోరిన సునీత కేజ్రీవాల్
  • కేజ్రీవాల్ ఆరోగ్యం బాగాలేదు... కుటుంబం ఆందోళన చెందుతోందన్న మంత్రి గోపాల్ రాయ్
  • కేజ్రీవాల్‌కు మద్దతుగా ఈ నెల 31న రాంలీలా మైదాన్‌కు ప్రజలు తరలి రావాలని పిలుపు
 
Wife Sunita announces WhatsApp campaign for jailed CM

తన భర్త నిజమైన దేశభక్తుడని, కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ అన్నారు. ఆమె శుక్రవారం కేజ్రీవాల్‌ను ఆశీర్వదించండంటూ వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈరోజు ఓ వీడియోను విడుదల చేశారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ఆయన నియంత శక్తులను సవాల్ చేస్తున్నారని... ఈ సమయంలో ఆయనకు మన మద్దతు కావాలన్నారు.

కేజ్రీవాల్‌ను ఆశీర్వదిస్తున్నామని అందరూ సందేశాన్ని పంపించాలని కోరుతూ వాట్సాప్ నెంబర్‌ను షేర్ చేశారు. 'ఈరోజే కేజ్రీవాల్‌కు ఆశీర్వాదమిచ్చే వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. మీరు మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దీవెనలు ఈ నెంబర్‌కు సందేశం రూపంలో పంపించండి' అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు 8297324624 నెంబర్‌ను షేర్ చేశారు. 

కేజ్రీవాల్ ఆరోగ్యం బాగాలేదు: ఢిల్లీ మంత్రి గోపాల్
 
ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం బాగా లేదని, దీంతో ఆయన కుటుంబం ఆందోళన చెందుతోందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన తీరు దారుణమని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఈ నెల 31న ప్రజలంతా రాంలీలా మైదాన్‌కు రావాలని కోరారు. కేజ్రీవాల్‌ను ప్రధాని మోదీ అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. ఇందుకు ఢిల్లీ ప్రజలంతా ప్రధానిపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. అరెస్ట్‌పై ప్రతి ఒక్కరిలో అనుమానాలు ఉన్నాయన్నారు. నిన్న కోర్టులో కేజ్రీవాల్ వాస్తవాలను బయటపెట్టారన్నారు. నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తోందన్నారు.

Posted

K Kavitha: కవిత బెయిల్ పిటిషన్ 4వ తేదీకి వాయిదా 

01-04-2024 Mon 15:50 | Telangana
  • సుదీర్ఘ వాదనలు వినిపించిన ఇరువైపుల న్యాయవాదులు
  • ఈడీ రిప్లై రిజాయిండర్‌కు సమయం కోరిన కవిత తరఫు న్యాయవాదులు
  • 3వ తేదీ సాయంత్రానికి రిజాయిండర్ దాఖలు చేస్తామని వెల్లడి
 
Kavitha bail petition postponed

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు వాదనలు విని... తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈరోజు కవిత తరఫు లాయర్లు, ఈడీ తరఫు లాయర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు.

ఈడీ రిప్లై రిజాయిండర్‌కు కవిత తరఫు న్యాయవాదులు సమయం కోరారు. ఏప్రిల్ 3 సాయంత్రానికి రిజాయిండర్ దాఖలు చేస్తామని వెల్లడించారు. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. గురువారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ చేపట్టనుంది.

Posted

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు వెళ్తున్న తొలి సీఎం కేజ్రీవాల్ 

01-04-2024 Mon 12:27 | National
  • కేజ్రీవాల్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
  • కాసేపట్లో తీహార్ జైలుకు కేజ్రీవాల్ తరలింపు
  • మార్చ్ 22న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ
 
court sends Delhi CM Arvind Kejriwal to judicial custody till April 15

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు (14 రోజులు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేజ్రీవాల్ కు కోర్టు విధించిన ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో, ఆయనను ఈరోజు కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను కాసేపట్లో ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత నెల 22న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Posted

Yashasini Reddy: కేసీఆర్ మొదట జైల్లో ఉన్న కవితను పరామర్శించడానికి వెళ్లాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 

01-04-2024 Mon 17:53 | Telangana
  • ఒకరి అర ఎకరం పొలానికి గ్రౌండ్ వాటర్ లేక ఎండిపోయిందన్న యశస్విని రెడ్డి
  • బీఆర్ఎస్ నాయకులు పదేపదే అదే పొలాన్ని సందర్శిస్తూ టూరిస్ట్ స్పాట్‌గా మార్చారని ఎద్దేవా 
  • ఆ పొలాన్ని ఎర్రబెల్లి దయాకరరావు, హరీశ్ రావు, కేసీఆర్‌లు పదిరోజుల వ్యవధిలో సందర్శించారన్న ఎమ్మెల్యే
  • కేసీఆర్, మాజీ మంత్రులు జైలుకు వెళతారని జోస్యం
 
Yashaswini Reddy says kcr should go to jail to see kavitha

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలుత మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న తన కూతురు కవితను పరామర్శించేందుకు వెళ్లాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎద్దేవా చేశారు. దేవరప్పుల మండలం ధారావత్ తండాలో కేసీఆర్ ఎండిపోయిన పంటలను పరిశీలించి... ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో యశస్వినిరెడ్డి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేదన్నారు. ఒకరి అర ఎకరం పొలానికి గ్రౌండ్ వాటర్ లేక ఎండిపోయిందని... బీఆర్ఎస్ నాయకులు పదేపదే ఆ ఒక్క పొలాన్ని సందర్శిస్తూ టూరిస్ట్ స్పాట్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. అదే పొలాన్ని ఎర్రబెల్లి దయాకరరావు, హరీశ్ రావు, కేసీఆర్‌లు పదిరోజుల వ్యవధిలో సందర్శించారని విమర్శించారు.

కేసీఆర్ పరిశీలించిన పొలంలో వరుసగా నాలుగుసార్లు బోర్లు వేసినా నీళ్లు రాలేదని వెల్లడించారు. కానీ పక్కనే ఉన్న మరో రైతు పొలంలో నీళ్లు వస్తున్నట్లు చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదు? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్న కేసీఆర్ ఇప్పుడు పొలంబాట పట్టడం విడ్డూరమన్నారు. అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, మాజీ మంత్రులు జైలుకు వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు. ఆ ఒత్తిడిలోనే రైతులను అడ్డు పెట్టుకొని రాజకీయ షోలు చేస్తున్నారని విమర్శించారు.

Posted

K Kavitha: కవితకు ఇంటి భోజనం, ఆభరణాలు, మెడిటేషన్ కోసం జపమాలను అనుమతించిన కోర్టు

01-04-2024 Mon 20:37 | Telangana
  • కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు
  • దుప్పట్లు, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలు అనుమతించాలన్న కోర్టు
  • మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాదులు
Court orders to home food to K Kavitha

తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ మద్యం కేసులో ఆమె అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కవిత తనకు అవసరమైన కొన్నింటిని స్వయంగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఆమె ఏర్పాటు చేసుకున్న జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులను అనుమతించాలని ఆదేశించింది. ఇంటి నుంచి ఆహారం, దుప్పట్లు తెచ్చుకోవటానికి, ఆభరణాలు ధరించేందుకు కూడా అనుమతించింది. మెడిటేషన్ చేసుకోవడానికి జపమాల, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలను అనుమతించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకోవడానికి అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్ న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం వెసులుబాట్లు అందించాలంటూ మరోసారి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...