Jump to content

update on kavita case


Recommended Posts

Posted

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు తీహార్ జైల్లో ఏ గదిని కేటాయించారంటే..!

01-04-2024 Mon 20:05 | NRI
  • కేజ్రీవాల్ డైలీ రొటీన్ ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభం
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా చాయ్, కొన్ని బ్రెడ్ స్లైస్‌లు ఇవ్వనున్న జైలు అధికారులు
  • సాయంత్రం ఐదున్నర గంటలకు డిన్నర్
  • రాత్రి ఏడు గంటల వరకు మళ్లీ జైలు గదికి కేజ్రీవాల్
Arvind Kejriwal brought to Tihar Jail prison no 2

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీహార్ జైల్లో రెండో నెంబర్ గదిని కేటాయించారు. మద్యం అంశానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌కు ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను సాయంత్రం జైలుకు తరలించారు. జైల్లో మిగతా ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్ డైలీ రొటీన్ ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా చాయ్, కొన్ని బ్రెడ్ స్లైస్‌లు ఇస్తారు. కాలకృత్యాలు పూర్తయ్యాక కోర్టు విచారణ ఉంటే తీసుకువెళతారు. లేదంటే సీఎం తన న్యాయబృందంతో సమావేశం కావడానికి అనుమతి ఇస్తారు.

ఉదయం పదిన్నర గంటల నుంచి పదకొండు గంటల మధ్య భోజనం ఇస్తారు. పప్పు, కూర, అన్నం, ఐదు రొట్టెలు ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ముఖ్యమంత్రి తన గదిలో ఉండాలి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒక కప్పు చాయ్, రెండు బిస్కట్లు ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లతో సమావేశం కావొచ్చు. సాయంత్రం ఐదున్నర గంటలకు డిన్నర్ ఇస్తారు. రాత్రి ఏడు గంటల కల్లా మళ్లీ జైలు గదికి పంపిస్తారు.

జైల్లో కేజ్రీవాల్‌కు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. టీవీ చూసే సదుపాయం ఉంది. 18 నుంచి 20 ఛానళ్ల వరకు చూసేందుకు అనుమతించారు. 24/7 వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆయన డయాబెటిస్‌తో బాధపడుతున్నందున రెగ్యులర్‌గా చెకప్ చేస్తారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రత్యేక డైట్ ఇవ్వాలని ఆయన లాయర్లు కోరారు. కేజ్రీవాల్ వారానికి రెండుసార్లు తన కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు.

Posted

 

K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ 

04-04-2024 Thu 16:56 | Telangana
  • రౌస్ అవెన్యూ కోర్టులో ముగిసిన వాదనలు
  • కవిత తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ
  • సోమవారం తీర్పు వెలువరించనున్నట్లు తెలిపిన న్యాయమూర్తి
 
Judgement reserved on Kavitha bail petition

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. కోర్టు అనుమతితో ఆమెను ఈడీ పది రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఆమెకు న్యాయస్థానం జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. 

 

Posted

K Kavitha: ఢిల్లీ మద్యం కేసులో ప్రణాళికలు రచించింది కవితే: ఈడీ 

04-04-2024 Thu 17:31 | Telangana
  • కవిత తన ఫోన్ డేటాను డిలీట్ చేశారన్న ఈడీ
  • విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదన్న ఈడీ
  • కవిత నుంచి 10 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, అన్నీ ఫార్మాట్ చేసిందని వెల్లడి
 
ED alleges Kavitha for Delhi Liquor scam

ఢిల్లీ మద్యం కేసులో కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. అసలు మద్యం పాలసీ కుంభకోణానికి కవితనే ప్రణాళికలు రచించారని పేర్కొంది. కవిత తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని పేర్కొంది. ఆమెను పది రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించామని, కానీ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదన్నారు.

కవిత నుంచి 10 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వాటన్నింటినీ ఫార్మాట్ చేసి ఇచ్చారని ఈడీ పేర్కొంది. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని తెలిపింది. నిందితులకు చెందిన వందలకొద్ది డిజిటల్ డివైజ్‌లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది.

Posted

K Kavitha: లిక్కర్ కేసులో కీలక పరిణామం... కవితను విచారించేందుకు కోర్టులో సీబీఐ పిటిషన్ 

05-04-2024 Fri 15:44 | Telangana
  • ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిన ఈడీ
  • ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత
  • జైల్లోనే కవితను ప్రశ్నిస్తామన్న సీబీఐ
 
CBI files petition seeking courts permission to question Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణకు హాజరు కావాలంటూ కవితకు గతంలోనే సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు సంబంధించి తన పిటిషన్ కోర్టులో ఉందని... అందువల్ల తాను కోర్టుకు హాజరుకాలేనని ఆమె సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఈడీ అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకుని విచారణ జరపడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. 

కవితను జైల్లోనే ప్రశ్నించేందుకు అనుమతించాలని తన పిటిషన్ లో సీబీఐ కోరింది. కోర్టు అనుమతి మంజూరు చేస్తే.. జైల్లోనే ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారు. కేసులో సాక్షిగా ఉన్నప్పుడు కవితను సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు ఆమెను సీబీఐ నిందితురాలిగా మార్చింది.

Posted

VV Lakshminarayana: కవితను ప్రశ్నించేందుకు సీబీఐ వాళ్లు అందుకే త్వరపడినట్టు కనిపిస్తోంది: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 

05-04-2024 Fri 17:31 | Telangana
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ
  • కవితను ప్రశ్నించేందుకు కోర్టును ఆశ్రయించిన సీబీఐ
  • సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు
  • కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న లక్ష్మీనారాయణ
  • అయితే కోర్టు కొన్ని షరతులు విధించవచ్చని వెల్లడి 
 
CBI Former JD Lakshminarayana opines on Kavitha case

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా, కవితను విచారించేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. 

"కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఆమెను ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. అందుకే సీబీఐ వారు కోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ఓ మహిళను ప్రశ్నించే సమయంలో అక్కడ మహిళా అధికారులు తప్పకుండా ఉంటారు. విచారణ ఎదుర్కొంటున్న వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా, అక్కడ మహిళా కానిస్టేబుళ్లను, మహిళా అధికారులను ఉంచుతారు. 

ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎవరి పాత్ర ఏంటి అనేది తేల్చడానికి సీబీఐ దర్యాప్తు ఉపయోగపడుతుంది. మనీలాండరింగ్ అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తే... అవినీతి సంబంధిత అంశాల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేస్తుంది. తమ పరిధి మేరకు సీబీఐ వారు చార్జిషీట్ వేస్తారు. 

తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయంటూ కవిత ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసినందునే సీబీఐ వాళ్లు త్వరపడినట్టు కనిపిస్తోంది. కవితకు బెయిల్ వస్తే విచారించడం కష్టమని భావించి, ఆమె జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడే ప్రశ్నించే విధంగా సీబీఐ అడుగులు వేసినట్టు తెలుస్తోంది. 

ఆమెను ప్రశ్నించడం అనేది దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. అందుకే సీబీఐ వాళ్లు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ఈ దశలో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అనలేం. ఎందుకంటే, ఆమెపై మోపిన ఆరోపణలు, సేకరించిన సాక్ష్యాలు కోర్టులో నిలబడితేనే కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 

కవిత బెయిల్ పిటిషన్ పై సోమవారం నాడు తీర్పు రానుంది. ఆ తర్వాత ఆమె ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో రెగ్యులర్ బెయిల్ కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లలకు పరీక్షలు ఉన్నాయని కవిత బెయిల్ కోరుతున్నారు కాబట్టి, కోర్టు ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవచ్చు. పరీక్షల వేళ పిల్లలకు తల్లి అవసరం ఉంటుందన్న కోణంలో కోర్టు ఈ అంశాన్ని చూసే అవకాశం ఉంది. 

అందుకే, పరీక్షల వరకే వర్తించేలా తాత్కాలిక బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో, సాక్షులను ప్రభావితం చేయరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, రాజకీయ ప్రకటనలు చేయనాదని కూడా షరతులు విధించొచ్చు. ఒకవేళ ఈ కోర్టు బెయిల్ ఇవ్వకపోతే కవిత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లవచ్చు. 

ఇప్పుడు కవిత ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అందువల్ల ఈడీ వారు ఆమెకు ప్రతి 15 రోజులకు ఓసారి రిమాండ్ పెంచుకుంటూ పోయేందుకు ప్రయత్నిస్తారు. 

ఈ కేసులో మనీశ్ సిసోడియా ఒక ఏడాదిగా జైల్లో ఉన్నారు. సత్యేంద్ర జైన్ ఆరోగ్య కారణాలతో బయటికి వచ్చారు. సంజయ్ సింగ్ కు కూడా బెయిల్ వచ్చిందని నేను విన్నాను కానీ, నిజంగా వచ్చిందో లేదో గమనించలేదు. సహజంగానే దర్యాప్తు సంస్థలు నిందితులకు బెయిల్ ఇవ్వవద్దనే కోర్టులను కోరుతుంటాయి" అంటూ లక్ష్మీనారాయణ తన విశ్లేషణను తెలియజేశారు.

Posted

K Kavitha: సీబీఐ విచారణకు అనుమతించడాన్ని రౌస్ అవెన్యూ కోర్టులో సవాల్ చేసిన కవిత 

06-04-2024 Sat 15:42 | Telangana
  • లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ
  • ఇప్పుడీ కేసులో సీబీఐ విచారణకు ఢిల్లీ కోర్టు అనుమతి
  • పిటిషన్ వేసిన కవిత... కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ
  • తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా
 
Kavitha challenges CBI probe

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, ఈ కేసులో కవితను విచారించేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

తనను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని కవిత సవాల్ చేస్తూ, రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. కవిత న్యాయవాది నితీశ్ రాణా కోర్టు ఎదుటకు పిటిషన్ లోని అంశాలను మెన్షన్ చేశారు. 

అయితే, కవిత పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ కోరగా, ఏప్రిల్ 10 వరకు సమయం ఇస్తామని కోర్టు తెలిపింది. సీబీఐ కౌంటర్ అఫిడవిట్ సమర్పించాక, ఏప్రిల్ 10వ తేదీన తదుపరి విచారణ చేపడతామని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

కాగా, సోమవారం నాడు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో తీర్పు వెలువడనుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Posted

K Kavitha: కవితకు తీవ్ర నిరాశ.. బెయిల్ నిరాకరించిన కోర్టు 

08-04-2024 Mon 10:15 | Telangana
  • మార్చి 26వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత
  • కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన కవిత
  • కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
 
Delhi Court refuses to give bail to Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురయింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో... తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు... కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. 

లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. రేపటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ను కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Posted

Kavitha Letter: తీహార్ జైలు నుంచి కవిత నాలుగు పేజీల లేఖ 

09-04-2024 Tue 12:48 | Telangana
  • ‘నేను బాధితురాలిని.. నాకు న్యాయం కావాలి’ అన్న ఎమ్మెల్సీ
  • మంగళవారం 4 పేజీల లేఖ విడుదల
  • తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణ
  • ఎలాంటి ఆర్థిక లబ్ది పొందలేదంటూ వివరణ
 
BRS Mlc Kavitha Open Letter From Tihar jail

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ‘నేను బాధితురాలిని.. నా అరెస్టు అక్రమం.. నాకు న్యాయం కావాలి’ అంటూ తీహార్ జైలు నుంచి ఆమె రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తికి మంగళవారం ఓ లేఖ రాశారు. నాలుగు పేజీల ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆరోపిస్తున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక లబ్ది చేకూరలేదని కవిత స్పష్టం చేశారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి, తన రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్రలో భాగంగా పెట్టిన కేసు అని లేఖలో పేర్కొన్నారు. తప్పుడు కేసు పెట్టి తనను అరెస్టు చేశారని ఆరోపించిన కవిత.. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసులో ఈడీ, సీబీఐ దర్యాఫ్తు చేస్తున్నాయని చెప్పారు.

దర్యాఫ్తు సంస్థలకు తాను పూర్తిగా సహకరించానని వివరించారు. పిలిచినప్పుడు వెళ్లి అధికారుల ప్రశ్నలు అన్నింటికీ జవాబిచ్చినట్లు కవిత తెలిపారు. అధికారులు ఆరోపిస్తున్నట్లుగా తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని, ఈ కేసులో తానే బాధితురాలినని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాఫ్తు మొత్తం మీడియా ట్రయల్స్ గా మారాయని, మీడియాలో సోషల్ మీడియాలో తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

బీజేపీలో చేరితే ఈ కేసు విచారణ ఆగిపోతుంది..
‘టీవీ ఛానల్స్ నా ఫోన్ నెంబర్ చూపించాయి. దీంతో నా ప్రైవసీకి భంగం కలిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు నాలుగు సార్లు విచారణకు హాజరయ్యా. అధికారులు అడగడంతో బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చా. నా మొబైల్ ఫోన్లను కూడా అందించి విచారణకు పూర్తిగా సహకరించా. కానీ, అధికారులు మాత్రం నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశానని ఆరోపించారు. రాజకీయంగా నా పరపతిని దెబ్బతీయడమే ఈ కేసు వెనక ఉన్న ఉద్దేశమని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. ఇదొక్కటే కాదు.. ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాఫ్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి. బీజేపీలో చేరితే ఈ కేసుల విచారణ ఆగిపోతుంది. మళ్లీ వాటి ఊసే వినిపించదు. సాక్షాత్తూ పార్లమెంట్ లోనే బీజేపీ నేతలు ప్రతిపక్ష ఎంపీలను బెదిరించారు. నోర్మూసుకుంటారా లేక ఈడీని పంపించాలా అంటూ హెచ్చరించారు. లిక్కర్ స్కాం కేసులో దర్యాఫ్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తా. ఈ కేసులో బెయిల్ నాకు ఇవ్వాలని కోరుతున్నా’ అంటూ కవిత తన లేఖలో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

20240409fr6614ebbf1bacb.jpg

Posted

 

K Kavitha: కవిత రిమాండ్ పొడిగించాలన్న ఈడీ.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు 

09-04-2024 Tue 11:51 | Telangana
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత
  • మార్చి 26 నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత
  • నేటితో ముగిసిన జ్యుడీషియల్ కస్టడీ
 
Court reserves verdict in Kavitha judicial custody extension

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. దీనిపై కోర్టు తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు... ఆ తర్వాత కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.   

 

Posted

K Kavitha: నేటితో ముగుస్తున్న కవిత రిమాండ్.. కోర్టులో హాజరుపరచనున్న ఈడీ 

09-04-2024 Tue 09:16 | Telangana
  • ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రిమాండ్
  • ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత
  • కవితకు బెయిల్ నిరాకరించిన కోర్టు
 
Judicial custody of MLC Kavitha ending today

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. కవితకు కోర్టు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించే అవకాశం ఉంది. మరోవైపు, కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. 

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. మరోవైపు, కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

Posted

K Kavitha: కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించిన కోర్టు 

09-04-2024 Tue 12:08 | Telangana
  • కవిత రిమాండ్ ను 14 రోజులు పొడిగించిన కోర్టు
  • ఏప్రిల్ 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగింపు
  • మార్చి 26 నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత
 
Kavitha judicial remand extended

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. కవిత రిమాండ్ ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తీర్పును వెలువరించింది. తాజా తీర్పుతో కవిత ఈ నెల 23 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను నిన్న కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.

Posted

Arvind Kejriwal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ 

10-04-2024 Wed 10:15 | National
  • అరెస్టు అక్రమం కాదంటూ పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
  • కోర్టుపై గౌరవం ఉందంటూనే తీర్పును అంగీకరించలేమన్న ఆప్
  • హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన ఢిల్లీ సీఎం
 
Arvind Kejriwal moves Supreme Court against his arrest

లిక్కర్ పాలసీ స్కాంలో తన అరెస్టు అక్రమమని, నిబంధనల ఉల్లంఘనే అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. తనను వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇవే అంశాలతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం విచారించిన కోర్టు.. కేజ్రీవాల్ అరెస్టులో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేల్చింది. ఆధారాలు ఉన్నాయంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన వాదనతో ఏకీభవించింది. కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పిటిషన్ ను కొట్టేసింది. 

దీనిపై ఆ పార్టీ నేతలు స్పందిస్తూ.. ఢిల్లీ హైకోర్టుపై తమకు గౌరవం ఉందని, అయితే, తాజా తీర్పును మాత్రం ఆమోదించబోమని చెప్పారు. హైకోర్టులో చుక్కెదురు కావడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈమేరకు కేజ్రీవాల్ లాయర్లు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించిన విషయం గుర్తుచేస్తూ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

Posted

K Kavitha: సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్.. విచారణ వాయిదా 

10-04-2024 Wed 15:35 | Telangana
  • జైల్లో విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి
  • తమ వాదనలు వినకుండానే సీబీఐకి అనుమతినివ్వడంపై కవిత పిటిషన్
  • తదుపరి విచారణ ఏప్రిల్ 26కి వాయిదా
 
Kavitha petition on CBI qustioning

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కవితను జైల్లో విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతించింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సవాల్ చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కవితను విచారించారని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ నుంచి తమకు కౌంటర్ రిప్లై అందలేదని కవిత తరపు లాయర్ చెప్పాగా... ఆ అవసరం లేదని సీబీఐ బదులిచ్చింది. శనివారమే (ఏప్రిల్ 6) కవితను తాము ప్రశ్నించామని... కాబట్టి కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. 

అయితే.. భవిష్యత్తులో జరిగే విచారణకు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని సీబీఐని జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. కవితను తీహార్ జైల్లో విచారించేందుకు సీబీఐకి ఏప్రిల్ 5న కోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే, తమ వాదనలు వినకుండానే సీబీఐకి అనుమతిని ఇవ్వడాన్ని కోర్టులో కవిత సవాల్ చేశారు. 

Posted

K Kavitha: జైల్లో ఉన్న నన్ను సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుంది?: కోర్టులో కవిత పిటిషన్ 

11-04-2024 Thu 17:23 | Telangana
  • తనను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్
  • తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసిందన్న కవిత
  • కవిత తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మోహిత్ రావు
  • తనకు ఈ కేసు గురించి తెలియదన్న డ్యూటీ జడ్జి
  • రేపు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచన
 
Kavitha petition in court about her arrest

తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జైల్లో ఉన్న తనను ఎలా అరెస్ట్ చేసిందంటూ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన కోర్టును కోరారు.

రిలీఫ్ ఇవ్వలేనన్న డ్యూటీ జడ్జి

ఈరోజు రంజాన్ కావడంతో డ్యూటీ జడ్జి మనోజ్ కుమార్ ఉన్నారు. కవిత తరఫున రాణా, మోహిత్ రావులు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని జడ్జి మనోజ్ కుమార్ పేర్కొన్నారు. తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన విచారణ జరగలేదని తెలిపారు. కాబట్టి ఇందులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పష్టం చేశారు. రేపు ఉదయం పది గంటలకు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు.

కాగా, కవితను గత నెల 15న ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఆమెను ఈడీ పది రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఆమె తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సీబీఐ ఆమెను తమ కస్టడీలోకి తీసుకుంది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...