psycopk Posted October 9, 2014 Report Posted October 9, 2014 గరుత్మంతుని ఉపాఖ్యానమునే సౌపర్ణోపాఖ్యానం అని అంటారు. వినతాదేవియొక్క కుమారుడు గరుత్మంతుడు. కద్రువ పుత్రులు సర్పములు. కద్రువ, వినతా వీరుభయులు కశ్యప ప్రజాపతియొక్క భార్యలు. వారిరువురికీ స్పర్థ ఉన్నది. ఈ స్పర్థలో ఒకప్పుడు కద్రువ, వినత పోటీపడ్డారు. క్షీరసాగరమథనం నుంచి పుట్టిన ఉచ్ఛైశ్రవమనే తెల్లని గుర్రం ఉన్నది. దాని రంగుగురించి ఇద్దరూ పందెం వేసుకున్నారు. ఎక్కడైనా నలుపు చూపిస్తే నీకు నేను దాసీగా ఉంటాను అన్నది వినత. అప్పుడు కద్రువ వినతను మోసం చెయ్యాలని తన వేయిమంది సంతానాన్ని పిలిచి ఆ నల్లత్రాచులను ఉచ్ఛైశ్రవం తోకకు వ్రేళ్ళాడమని ఆజ్ఞాపించింది. తల్లి చెప్పినట్లు చేయకుంటే రోషంతో కుమారులనికూడా లెక్కచేయక శాపం ఇస్తుందనే భయంతో వారు గుర్రంయొక్క తోకకు చుట్టుకున్నాయి. మోసంతో వినతను దాసీగా వినియోగించింది కద్రువ. తల్లిని అనుసరించి గరుత్మంతుడు కూడా దాస్యం చేశాడు. తన తల్లి దాస్యవిముక్తికి ఏమి చేయాలి? అని కద్రువను అడిగాడు గరుత్మంతుడు. అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముక్తులని చేస్తాను అన్నది కద్రువ. క్షీరసాగరమథనం నుంచి పుట్టిన అమృతాన్ని దేవతలు ఒకవిధమైన సర్ప శక్తులతోనూ, దర్భలమీద పెట్టి ఉంచారు. త్రోవలో ఎవరినీ హింసించకుండా ఉండే ఆహారం కావాలని అడిగితే సముద్రగర్భంలో నిషాదలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని స్వీకరిస్తే లోకరక్షణ కూడా జరుగుతుంది అని కశ్యపప్రజాపతి చెప్పాడు. ఇదే సమయంలో గజకచ్ఛపములనే భయంకరమైన శక్తులున్నాయి. వాటిని ఆహారంగా స్వీకరించి నశింపచేయాలి అని చెప్తే తిందామని కాలుతో పట్టుకొని ఆరెంటినీ తినడానికి అనువైన స్థలంకోసం వెతుకుతుండగా అతని వేగానికి వృక్షాలన్నీ కంపించాయి.అప్పుడు అక్కడి పెద్ద మర్రిచెట్టు తన కొమ్మపై చేరి గజకచ్ఛపాలను భుజించమని కోరింది. గరుడుడు దానికొమ్మపై వ్రాలగానే ఆకొమ్మ విరిగిపోయింది. ఆకొమ్మను పట్టుకొని చూడగా అధోముఖులై వ్రేలాడుతూ మహర్షులు అనేకమంది ఉన్నారు. వారంతా మహా తేజస్సంపన్నులు, బొటనవ్రేలి పరిమాణంలో ఉన్నారు. కొమ్మను విడిచిపెడితే వారికి ప్రమాదం అని, వారిని కాపాడాలని తలంచి ముక్కుతో కొమ్మను పట్టుకొని ఎగిరాడు. రెండు కాళ్ళతో గజకచ్ఛపములను పట్టుకున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ హిమవత్పర్వతం వద్దకు వెళ్ళాడు. అక్కడ వారిని విడిచి ప్రార్థన చేయమని కశ్యపుడు గరుడునికి చెప్పాడు. అంతేకాక తానుకూడా వారినిలా ప్రార్థించాడు-"గరుడుడు ప్రజల క్షేమంకోరి గొప్పకార్యం చేయబోతున్నాడు. దానిని మీరు అనుమతించండి" అని. కశ్యపుని ప్రార్థనను అంగీకరించి వాలఖిల్య మహర్షులు చెట్టుకొమ్మను విడిచి గరుత్మంతుని దీవించి హిమవత్పర్వతానికి తపస్సుకై వెళ్ళిపోయారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు మహాయజ్ఞం చేస్తూ యజ్ఞద్రవ్యాలకై ఇంద్రాది దేవతలను పంపాడట. సూర్యగమనం జరుగుతున్నప్పుడు సౌరశక్తి విశేషాన్ని స్తుతిస్తూ ఉంటారు వాలఖిల్యులు. ఇంద్రుడు మోపు పట్టుకొని వస్తుండగా వాలఖిల్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క రావిపుల్ల పట్టుకొని వస్తున్నారట. వారిని చూసి ఇంద్రుడు నవ్వాడట. శక్తిలో, సమర్పణలో, శ్రద్ధలో ఇరువురూ సమానమే. దీనినిబట్టి సృష్టిలో ఒకరిని తక్కువ చేయకూడదు అని తెలియజెప్తుంది. పర్వతాలను ఎత్తుకెళ్ళిన వానరులను ఎంత కరుణించాడో ఇసుకపోసిన ఉడుతను కూడా అంతే ఆదరించాడు రామచంద్రమూర్తి. నీవు ఏ బలాన్ని చూసి అహంకరిస్తున్నావో ఆ బలం పుట్టబోయే మరో ఇంద్రునివల్ల నీ అహం అణగుతుంది" అని శపించారు వాలఖిల్యులు. అప్పుడు కశ్యపప్రజాపతి మొదలైన వారు వచ్చి ఇంద్రుని క్షమించమని కోరారు. అప్పుడు వారు మా శాపం వృధాపోదు. ఈయనకు పాఠం చెప్పడానికి ఇంద్రునికంటే శక్తిమంతుడొకడు కశ్యపుని కడుపునే పుడతాడు. అతడు కూడా ఇంద్రునిగానే (పక్షీంద్రుడు) పిలవబడతాడు అని వాలఖిల్యులు చెప్పారు. యోగరహస్యం: కచ్ఛపము - ఆధారశక్తి, మూలాధారం. గజం-తొండంతో పీల్చేశక్తి. వాతాపి. మూలాధారం నుంచి సహస్రారమ్ వరకు. సహస్రార ధ్వనికి సప్తస్వరాలలో నిషాదస్వరం ఏనుగుయొక్క హ్రీంకారంలోనుంచి వచ్చిందట. సహస్రార స్థానం గజస్థానం. సహస్రారగతమైన శక్తి సామాన్యశక్తి కాదు. ఆశక్తికి సంకేతం ఏనుగు. గణపతి ఏనుగు ముఖంలో ఉండడంలో రహస్యం అది. ఈరెంటినీ పట్టి సాధించే యోగశక్తిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగుతాయి. ఉచ్ఛ్వాసం ఒక రెక్క. నిశ్వాసం మరొక రెక్క. ఈ రెండు రెక్కలతో ఎగిరే సుపర్ణుడు(గరుత్మంతుడు) ప్రాణశక్తి స్వరూపుడు. సహస్రార కమలానికి చేరితేనే కానీ దివ్యామృతం దొరకదు. అమృతం దగ్గరకు వెళ్ళేసరికి దేవతలు అడ్డుకున్నారు. అవలీలగా వారందరినీ కొట్టేసి అమృతభాండం దగ్గరికి వెళ్ళి చూడగా భయంకరమైన మంటలవలె మెరిసిపోతున్న విషజ్వాలలు కక్కుతున్న సర్పాలు ఉన్నాయిట. పైన ఒక చక్రం తిరుగుతోంది. రెక్కలతో పాములన్నీ ఎగరకొట్టి ముక్కుతో పొడిచి చక్రాన్ని చీలికలు చేసి అమృతకలశాన్ని అవలీలగా పట్టుకొని వెళ్ళాడు.
Recommended Posts