TampaChinnodu Posted October 12, 2017 Report Share Posted October 12, 2017 రూ.2652 కోట్లతో రాజధానిలో ఇళ్లు అంచనా వ్యయం రూ.661 కోట్లు పెంపు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు 61 టవర్ల నిర్మాణం ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ కేటగిరీల ఉద్యోగుల కోసం చేపట్టనున్న గృహ నిర్మాణ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,652 కోట్లకు పెరిగింది. ఒక్కొక్కటి జీ+12 పద్ధతిలో మొత్తం 61 టవర్లు నిర్మిస్తారు. వీటిలో వివిధ కేటగిరీలకు చెందిన 3,840 ఫ్లాట్లు ఉంటాయి. టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది. గుత్తేదారుల్ని ఎంపిక చేశారు. సవరించిన అంచనాలకు, టెండరు ప్రక్రియకు బుధవారం జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదముద్ర వేసింది. గతంలో గృహ నిర్మాణానికి రూ.1,991 కోట్లతో అంచనాలు రూపొందించారు. అప్పటితో పోలిస్తే అంచనా వ్యయం రూ.661 కోట్లు పెరిగింది. మొత్తం నిర్మాణ ఏరియాను 76,81,500 చ.అడుగుల నుంచి 84,57,078 చ.అడుగులకు పెంచామని, పార్కింగ్ కోసం పోడియం ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం ఫ్లాట్ల సంఖ్యను మొదట అనుకున్న 3,820 నుంచి 3,840కి పెంచామని సీఆర్డీఏ అజెండాలో పేర్కొంది. గతంలో పన్నులు, డ్యూటీలు అంచనాల్లో చేర్చలేదని, ఇప్పుడు జీఎస్టీ వంటి పన్నులన్నీ కలిపి సవరించిన అంచనాలు రూపొందించామని పేర్కొంది. ఆరు నెలల్లో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వివరించింది. గుత్తేదారులు వీరే... గెజిటెడ్ అధికారులు టైప్-1, టైప్-2, నాలుగోతరగతి ఉద్యోగుల గృహ నిర్మాణానికి షాపూర్జీ పల్లోంజీ సంస్థ గుత్తేదారుగా ఎంపికైంది. ప్రభుత్వం నిర్ణయించిన టెండరు విలువ (ఐబీఎం వాల్యూ) కంటే 3.73 శాతం ఎక్కువకి పని దక్కించుకుంది. నాన్గెజిటెడ్ అధికారుల గృహ నిర్మాణానికి గుత్తేదారుగా ఎల్ అండ్ టీ సంస్థ ఎంపికైంది. ఆ సంస్థ 3.95 శాతం ఎక్కువకు పొందింది. ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారుల ఇళ్ల నిర్మాణానికి ఎన్సీసీ సంస్థ ఎంపికైంది. ఆ సంస్థ 4.59 శాతం ఎక్కువకి దక్కించుకుంది. మేం చాలా నేర్చుకుంటున్నాం అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ద్వారా తాము మరింత నేర్చుకుంటున్నామని సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఛాంగ్ తెలిపారు. సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు చెందిన ముఖ్యులతో ఏర్పాటైన రాజధాని పనుల సంయుక్త అమలు సాధికార కమిటీ (జేఐసీసీ) సమావేశం వచ్చే నెలలో జరగాల్సి ఉందని ఆయన ప్రస్తావించారు. పది రకాల ఆకృతులు శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారుల అపార్ట్మెంట్లు, మంత్రుల బంగ్లాలకు సంబంధించి తాము రూపొందించిన 10 రకాల ఆకృతులను టీమ్ వన్ ఇండియా సంస్థ ఈ సమావేశంలో ప్రదర్శించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో బ్లాక్కి ఒక నిర్మాణ శైలి ఉపయోగించుకునేలా తుది ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ‘‘విదేశీ పర్యటన నుంచి వచ్చాక రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటున్న అన్ని కన్సల్టెన్సీ సంస్థలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తాను. రాజధాని నిర్మాణం కీలక దశకు చేరుకున్నందున పురోగతి ఎలా ఉందో, ఏ దశలో ఉన్నామో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం అత్యవసరం’’ అని పేర్కొన్నారు. అమరావతిలో ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు తిరిగి ప్లాట్లు ఇచ్చిన లేఅవుట్ల అభివృద్ధి, బాహ్య, అంతర వలయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై వచ్చే సమావేశంలో సమగ్ర వివరాలతో రావాలని ఆదేశించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.