Unityunity Posted October 22, 2017 Report Share Posted October 22, 2017 ‘‘మీకేవమ్మా..! అమెరికా అల్లుడు దొరికాడు’’ అని ఇరుగుపొరుగు పొగడ్తలు వినిపించడం లేదిప్పుడు. ‘‘మా అల్లుడు అమెరికాలో ఉంటాడు.. అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటోంది’’ అని తల్లిదండ్రులూ గొప్పలకు పోవట్లేదు. కొన్నేళ్ల క్రితం వరకూ... తమ బిడ్డలకు అమెరికా సంబంధాలే కావాలని చాలామంది వివాహ వేదికలను ఆశ్రయించేవారు. జోడు దొరికేదాకా ఆగేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. మ్యారేజీ బ్యూరోల సహకారం తీసుకునేవారు తగ్గిపోతున్నారు. విదేశీ సంబంధాలే కావాలని అడిగేవారు కనిపించడమే లేదు. ఇందుకు కారణాలేవైనా, ‘‘అమ్మాయి మన దేశంలో ఎక్కడున్నా ఫర్వాలేదు. సుఖంగా ఉంటే అంతే చాలు’’ అన్న భావన తల్లిదండ్రుల్లో బాగా పెరుగుతోంది. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరిగి... పుట్టిన వూరు, బంధువులతో సంబంధాలు తెగిపోయి... పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడటం రెండు దశాబ్దాల క్రితమే చాలామంది తల్లిదండ్రులకు సమస్యగా మారింది. ఆ క్రమంలోనే దేశవ్యాప్తంగా వివాహ వేదికలు ఆవిర్భవించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వందల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. ఉభయ రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 3 వేల వరకూ మ్యారేజీ బ్యూరో కేంద్రాలున్నట్లు అంచనా. ప్రముఖ బ్యూరోలైతే తెలుగువారి కోసం కర్ణాటక, తమిళనాడుల్లోనూ బ్రాంచీలు ఏర్పాటుచేశాయి. ఆన్లైన్ సాంకేతికతనూ సమకూర్చుకున్నాయి. అయితే... రెండు మూడేళ్లుగా వీటి వ్యాపారం తగ్గుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సంబంధాల కోసం ఆరా తీసేవాళ్లు ఎక్కువగానే ఉన్నా... పెళ్లి కుదిరే శాతం మాత్రం బాగా తగ్గిపోయిందట! ఎందుకీ పరిస్థితి? * ప్రేమ వివాహాలు భారీగా పెరుగుతున్నాయి. తాము ఒకరినొకరం ఇష్టపడ్డామని పిల్లలుచెబితే ఉభయ కుటుంబాల పెద్దలు కలిసి పెళ్లిళ్లు జరిపిస్తుండంట విశేషం. * వివాహ విషయంలో తల్లిదండ్రులను యువత పెద్దగా పరిగణనలోకి తీసుకోవట్లేదు. సహచర ఉద్యోగులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఓ నిర్ణయానికి వచ్చి, పెద్దలకు చెబుతున్నారు. * విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు ఆయా దేశాల్లో స్థిరపడేందుకని తమ కార్యాలయాల్లో పనిచేసే సహచరులను వివాహం చేసుకోవడం ఇటీవల బాగా పెరుగుతోంది. * ఒకప్పుడు ఏ సంబంధమైనా తల్లిదండ్రులకు నచ్చితే చాలు. పిల్లలు సరే అనేవారు. ఇప్పుడు భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వారే తీసుకుంటున్నారు. ఫేక్బుక్ పరిచయాలు చివరకు పెళ్లి వరకూ వెళ్తున్నాయి. * పలు మ్యారేజీ బ్యూరోలపై తల్లిదండ్రులకు నమ్మకం తగ్గిపోతోంది. వారు కొన్ని వివరాలను దాచిపెడతారని, దానివల్ల భవిష్యత్తులో అనర్ధాలు సంభవిస్తున్నాయన్న ప్రచారం ఉంది. దీంతో తమ బంధువులు, స్నేహితుల కుటుంబాల ద్వారానే ఎక్కువగా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. * కొందరైతే ముందు బ్యూరోలను సంప్రదిస్తున్నారు. వారిచ్చిన సమాచారంతో సంతృప్తి చెందక... ఫేస్బుక్ ఇతరత్రా సామాజిక మాధ్యమాల్లో ఆరా తీస్తున్నారు. బ్యూరోలు ఇచ్చిన సమాచారంలో ఏ కొంచెం తేడా ఉన్నా, ప్రయత్నం మానుకుంటున్నారు. సంబంధం కుదిరిన తర్వాత కూడా... ఒకట్రెండు సార్లు అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుని... చిన్నచిన్న విషయాలకే సంబంధం వద్దనుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల బ్యూరోలను ఆశ్రయించేవారు తగ్గిపోతున్నారని గుంటూరుకు చెందిన ఓ వివాహ వేదిక నిర్వాహకుడు రవిచంద్ర చెప్పారు. ఆ సంబంధాలను అడిగేవారేరి? ఎంత మార్పు! ఒకప్పుడు విదేశీ సంబంధమంటే ఎగబడేవారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ సంబంధం ఉందని చెప్పినా- ‘‘ఆఁ... ఎందుకులెండి. చూస్తున్నాంగా అలాంటి సంబంధాలు చివరికి ఏమవుతున్నాయో. అనవసరంగా రిస్కు ఎందుకు? మన దేశంలో ఎక్కడ పనిచేసే వారైనా ఫర్లేదు. అలాంటి వారిని చూపించండి’ అని అడుగుతున్నారట. అసలు విదేశాల్లో పనిచేసే వారిని చూపించమని అడిగేవారే లేరంటున్నారు.. మ్యారేజీ బ్యూరో నిర్వాహకురాలు వై.రమాదేవి. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులకు ఒకరిద్దరు పిల్లలే ఉంటున్నారు. వారు తమ కళ్లెదుటే ఉండటం మంచిదనుకుంటున్నారు. మీడియాలో తరచూ ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల కేసులు వెలుగు చూస్తుండటంతో... వారిని నమ్మలేని పరిస్థితికి వస్తున్నారు. తెలిసినవారు, బంధువుల్లో ఎవరైనా ఎన్ఆర్ఐలు ఉంటేనే సరేనంటున్నారు. అయితే.. ఆడ, మగ అన్న తేడా లేకుండా తమ పిల్లల్ని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదివించాలనుకుంటున్న తల్లిదండ్రులు మాత్రం బాగా పెరుగుతుండటం విశేషం. బంధువర్గంలో ఒకరు తమ పిల్లల్ని పంపితే, మిగతావారూ అదే మార్గంలో వెళ్తున్నారు. ‘అమెరికా అల్లుడని గొప్పలు చెప్పుకోవడం తగ్గిపోయిందిప్పుడు. గ్రామాల నుంచి కూడా విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు ఉండటమే ఇందుక్కారణం’ అని జాతీయ గ్రామీణ సంస్థల మండలి ఛైర్మన్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ అభిప్రాయబడ్డారు. అమెరికాలాంటి దేశాల్లోనూ స్థిరత్వం ఉండదని, ఎప్పుడైనా పరిస్థితులు మారిపోవచ్చన్న అవగాహన ఇప్పుడు పెరుగుతోందని విశ్లేషించారు. * ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకులపై విదేశాల్లో 25 వేల కేసులు పెండింగులో ఉన్నాయి. ప్రేమయాత్ర (హనీమూన్) తర్వాత భార్య ముఖం చూడనివారు 22 వేల మంది ఉన్నారు. ఈ కేసుల్లో 15 వేలు కేవలం పంజాబ్, తెలుగు రాష్ట్రాల వారివే కావడం గమనార్హం! మహిళా కమిషన్ను ఆశ్రయించినవారూ ఎందరో ఉన్నారు. ఇలాంటి పరిణామాలతో చాలామంది ఎన్ఆర్ఐ సంబంధాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. * హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడికి పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యాట్రిమోనీ సంస్థలో పేరు నమోదు చేశారు. అమెరికాలో ఉద్యోగం అనేసరికి ఎవరూ ఆయనకు ఫోన్లు చేయలేదు. హెచ్1బీ వీసా ఉందని, అమెరికాలో ఉద్యోగమని వివరాలు తొలగించిన తర్వాతగాని ఎవరూ సంప్రదించలేదట! అమ్మాయి ఒప్పుకొంటే పండగే! కొన్నేళ్ల క్రితం వరకూ పెళ్లి చూపులంటే అబ్బాయిదే పైచేయిగా ఉండేది. పెళ్లికొడుకు ఓకే అంటాడా? లేదా? అని అమ్మాయి తరఫువారు విపరీతంగా ఒత్తిడికి గురయ్యేవారు. మళ్లీ కబురు చేస్తామని చెబితే... ఏదోకటి తేలేవరకూ ఆత్రంగా ఎదురు చూసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పెళ్లికూతురికి తమ కొడుకు నచ్చాడో, లేదోనని అబ్బాయి తరఫువారే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని... ఈ పరిణామం కాస్త విచిత్రంగానే ఉందని 30 ఏళ్లుగా వివాహ వేదికను నడుపుతున్న నిర్వాహకురాలు ఒకరు వ్యాఖ్యానించారు. వయసు పెద్ద తేడా ఉంటే ఒప్పుకోవట్లేదు గతంలో వరుడు ఆరేళ్లు పెద్ద అయినా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు తమ కంటే అబ్బాయిలు రెండు మూడేళ్లు మించితే అమ్మాయిలు ఒప్పుకోవడం లేదు. అబ్బాయి వయసు 30 దాటితే ఇష్టపడేవారు తక్కువట. ‘అమ్మాయిలు 25-26 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెళ్లి చేసుకోవడానికి సుముఖత చూపట్లేదు. అబ్బాయిలు 30 వరకు వెళుతున్నార’ని పలు బ్యూరోల నిర్వాహకులు చెబుతున్నారు. గౌరవం దక్కాలంటే ఒప్పుకోవాల్సిందే! మారిన తల్లిదండ్రుల ధోరణి పిల్లలు తాము ప్రేమించుకున్నామని చెబితే... మధ్య, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు అడ్డుచెప్పడం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. కుమారుడు తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటే.. కులాంతర వివాహమైనా సరేనని అంగీకరించి గౌరవం కాపాడుకుంటున్నారు. ఒకవేళ కాదన్నా.. వారు పెళ్లి చేసుకోవడం ఆగదు. అలాంటప్పుడు ఇక అడ్డు చెప్పడం ఎందుకన్న ధోరణిలో ఆలోచిస్తున్నారు. కూతురు విషయంలోనూ తల్లిదండ్రులు మొదట మొండికేసినా, చివరకు అదే జరుగుతోంది. కొందరు తల్లిదండ్రులైతే...‘‘పెళ్లీడు వచ్చింది. ఎప్పుడు చేసుకుంటావ్? ఎవరైనా అమ్మాయిని చూసుకున్నావా... మమ్మల్ని చూడమంటావా?’ అని కుమారులను అడుగుతున్నారు. నేటితరాన్ని అర్థం చేసుకోవడం కష్టం వివాహ వేదికలను సంప్రదించేవారు తగ్గిపోతున్న మాట వాస్తవమే. ప్రేమ పెళ్లిళ్లు, బంధువుల మధ్య సంబంధాలు అందుకోవడం ఇప్పుడు పెరుగుతోంది. ‘అవకాశమిస్తే సంబంధం వెతికి పెడతాం’ అని పిల్లలతో అంటున్న తల్లిదండ్రులూ లేకపోలేదు. మరోవైపు విడాకుల శాతమూ పెరుగుతోంది. నేటితరాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సర్దుబాటు ధోరణి బాగా తక్కువగా ఉంటోంది. - యలమంచిలి చిరంజీవిరావు, కాకతీయ మ్యారేజీ బ్యూరో ఎండీ షేర్ మార్కెట్లోకి వచ్చినా స్పందన కరవు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకూ మ్యారేజీ బ్యూరోలు వ్యాపించాయి. చాలామంది వాటిని సంప్రదిస్తున్నా, అవి కుదిర్చే పెళ్లిళ్లు విజయవంతం కావడం తక్కువగానే ఉంది. మొట్టమొదటిసారిగా ఇటీవలే ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థ పబ్లిక్ షేర్కు వచ్చింది. కానీ, స్పందన అంతగా లేదు. బ్యూరోల వ్యాపారం, అభివృద్ధిపై ప్రజలకు అంతగా నమ్మకం లేదని స్పష్టమవుతోంది. - ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, వాణిజ్యశాస్త్ర విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం Quote Link to comment Share on other sites More sharing options...
ceelogreen Posted October 22, 2017 Report Share Posted October 22, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Aakupaccha_caradu Posted October 22, 2017 Report Share Posted October 22, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.