Jump to content

Recommended Posts

Posted
చేతులెత్తేసిన ఆన్‌రాక్‌ 
రుణాలు చెల్లించలేమని స్పష్టీకరణ 
  దివాలా కుదరదన్న జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ 
  ఓటీఎస్‌ బాట పట్టిన సంస్థ 
  రూ. 2,905 కోట్ల నిరర్థక ఆస్తులు ప్రకటన 
  బ్యాంకులకు రూ. 1630 కోట్ల నష్టం 
ఈనాడు - హైదరాబాద్‌ 
22hyd-main1a.jpg

పెన్నా గ్రూపు, రస్‌ అల్‌ ఖైమాల భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఆన్‌రాక్‌ అల్యూమినియం కంపెనీ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.3,461 కోట్ల రుణాన్ని చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. ఏకకాల పరిష్కారం (వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌- ఓటీఎస్‌) బాట పట్టింది. దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఆన్‌రాక్‌ కోరగా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) నిరాకరించింది. రూ.వేల కోట్ల ప్రజాధనం, ప్రత్యక్షంగా 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలున్న కంపెనీ దివాలా ప్రక్రియ ప్రకటించే పరిస్థితుల్లేవని స్పష్టం చేసింది. దీంతో ఆన్‌రాక్‌ యాజమాన్యం మరోసారి ఓటీఎస్‌ను తెరపైకి తీసుకువచ్చింది. 2014 మార్చి 31 నాటికే రూ.2905 కోట్ల నిరర్థక ఆస్తిగా ప్రకటించగా అందులో కేవలం రూ.1275 కోట్ల చెల్లిస్తానంటూ ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసిందన్న కారణాన్ని చూపి ఓటీఎస్‌ పేరుతో బ్యాంకులకు రూ.1630 కోట్ల రుణాన్ని చెల్లించలేమని ఆన్‌రాక్‌ చేతులెత్తేస్తోంది. బ్యాంకుల కన్సార్టియానికి నేతృత్వం వహించే ఎస్‌బీఐతోపాటు పలు బ్యాంకులు ఈ ప్రతిపాదనకు అంగీకరించగా కొన్ని బ్యాంకులు తిరస్కరించాయి. మొత్తం మీద రూ.1630 కోట్ల సొమ్మును వదులుకోవడానికి బ్యాంకులు సిద్ధమైనట్లే కనిపిస్తోంది.

రూ. 5వేల కోట్ల ప్రాజెక్టు 
విశాఖపట్నం మాకవరపాలెం మండలం రాచపల్లిలో ఏర్పాటైన ఆన్‌రాక్‌లో పి.ప్రతాప్‌రెడ్డికి చెందిన పెన్నా గ్రూపు వాటా 70 శాతం. అరబ్‌ ఎమిరేట్స్‌లోని రాకియాకు 30 శాతం వాటా ఉంది. ఎస్‌బీఐ నేతృత్వంలోని 23 బ్యాంకుల కన్సార్టియం ఆన్‌రాక్‌ ప్రాజెక్టు విలువను రూ.4,608 కోట్లుగా అంచనా వేసింది. 2017 మార్చి 31 నాటికి ప్రాజెక్టు మీద రూ.5712 కోట్లు ఖర్చయింది. 2014 మార్చి 31 నాటికి రూ.2,905 కోట్లను నిరర్థక ఆస్తిగా బ్యాంకులు గుర్తించాయి.

దివాలా ప్రకటనకు తిరస్కారం 
ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో రుణం చెల్లించాలంటూ బ్యాంకులు డిమాండ్‌ నోటీసులు పంపాయి. దీంతో 2012లో రూ.1100 కోట్ల ఓటీఎస్‌కు ఆన్‌రాక్‌ ప్రతిపాదించగా బ్యాంకుల కన్సార్టియం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ  నిర్ణయంతో 2016లో ఈ కంపెనీకి బాక్సైట్‌ సరఫరా ఒప్పందాన్ని ఏపీఎండీసీ రద్దు చేసింది. బాక్సైట్‌ సరఫరా లేకపోవడంతో రుణాలు చెల్లించడానికి దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలంటూ ఆన్‌రాక్‌ దరఖాస్తు చేసింది. దీన్ని ట్రైబ్యునల్‌ తిరస్కరించింది. సమస్య పరిష్కారంలో శ్రద్ధ చూపలేదని తప్పుబట్టింది. గనులను కేటాయించడం గానీ, ఆన్‌రాక్‌ను ఏపీఎండీసీ స్వాధీనం చేసుకోవడానికి సమావేశాల్లో తీర్మానాలు చేశారని, సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఆ వివరాలతోపాటు ప్రస్తుతం చర్చలు ఏ దశలో ఉన్నాయో చెప్పాలని పలుమార్లు గడువిచ్చింది. అయినా ఆన్‌రాక్‌ కంపెనీ ట్రైబ్యునల్‌కు ఎలాంటి పత్రాలు సమర్పించలేదు. రూ.5,712 కోట్లతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులో పలు సామాజికాంశాలు ముడిపడి ఉన్నాయని, జాతి ప్రయోజనాలకు చెందిందని, పలువురు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, ప్రజాధనం ముడిపడి ఉన్నందున దివాలాకు అనుమతించలేమని ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియ దరఖాస్తును అనుమతించడానికి ముందు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నించాలని బ్యాంకులతోపాటు ఆన్‌రాక్‌ యాజమాన్యానికి ట్రైబ్యునల్‌ సూచించింది. 
బ్యాంకుల భిన్నాభిప్రాయాలు:  ఆన్‌రాక్‌ దరఖాస్తును ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించగా బ్యాంకుల కన్సార్టియం సెప్టెంబరులో సమావేశమైంది. ఆన్‌రాక్‌ రూ.1,250 కోట్లు ఓటీఎస్‌ కింద ప్రతిపాదించింది. దీనికి కన్సార్టియం అంగీకరించకపోవడంతో అక్టోబరులో మరోసారి సమావేశమయ్యారు. మరో రూ.25 కోట్లు చెల్లించడానికి వ్యవస్థాపకులు ఆమోదించారని ఆన్‌రాక్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ గణపతిరావు ఈ సందర్భంగా వెల్లడించారు. రుణానికి హామీదారుగా ఉన్న పి.ప్రతాప్‌రెడ్డి తన ఆస్తులను విక్రయించి ఈ మొత్తాన్ని చెల్లిస్తారని చెప్పారు. ప్రతాప్‌రెడ్డి హామీ రూ.560 కోట్లకే పరిమితమైనప్పటికీ రూ.1275 కోట్లు ఆస్తులను విక్రయించి చెల్లిస్తారని సమావేశంలో ప్రకటించారు. బ్యాంకు అధికారులు సుదీర్ఘంగా చర్చించి ఎన్‌సీఎల్‌టీ ద్వారా భూమి, ఇతర ఆస్తుల విక్రయంలో జాప్యం జరుగుతుందని, సులభమైన పరిష్కారాన్ని 2017 డిసెంబరు 13లోగా కనుగొనాలని నిర్ణయానికి వచ్చాయి. భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం ఒప్పందం పునరుద్ధరించడంపై అనిశ్చితి ఉండటంతో ఆన్‌రాక్‌ కంపెనీకి నిర్వహణ మూలధనం (వర్కింగ్‌ క్యాపిటల్‌) సమకూర్చడానికి బ్యాంకులు వెనుకంజ వేశాయి. ప్రతాప్‌రెడ్డి వ్యక్తిగత హామీతోపాటు ఫ్యాక్టరీ, ఇతర ఆస్తులుండటంతో ఓటీఎస్‌ మొత్తం పెంచమని డిమాండ్‌ చేయాలని ఐఓబీ డీజీఎం ప్రతిపాదించారు. ఈ విషయాన్ని వ్యవస్థాపకుల దృష్టికి తీసుకెళ్లగా నిస్సహాయత వ్యక్తం చేశారంటూ ఎస్‌బీఐతోపాటు మిగిలిన బ్యాంకులు వత్తాసు పలికి ఓటీఎస్‌కు అంగీకరిస్తున్నట్లుగా ప్రతిపాదన పంపారు. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యూబీఐ, యునైటెడ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌, ఇండియన్‌, జేెఎం ఫైనాన్షియల్‌, బరోడా, కెనరా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, లక్ష్మీ విలాస్‌ బ్యాంకులు ఓటీఎస్‌కు అంగీకరించాయి. యూకో బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, ఎల్‌ఐసీ, విజయ బ్యాంకుల ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐఓబీ బ్యాంకు జీఎం ఓటీఎస్‌ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆన్‌రాక్‌ ప్రతిపాదించిన రూ.1275 కోట్లకంటే యంత్రాల ప్రస్తుత విలువ ఎక్కువగా ఉంటుందని, ఓటీఎస్‌ కాకుండా మరో విధంగా రుణాలను తిరిగి రాబట్టుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

ఆర్‌బీఐ ఆదేశాలతో కదిలిన ఎస్‌బీఐ 
ఓవైపు ఓటీఎస్‌కు ఎస్‌బీఐ ఆమోదం తెలపగా.. మరోవైపు రుణాల వసూలకు చర్యలు చేపట్టాలని రిజర్వు బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేసింది. రుణంలో 60 శాతం కంటే ఎక్కువ నిరర్థక ఆస్తులున్న కంపెనీలపై దివాలా కోడ్‌ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిసెంబరు 27న లేఖ రాసింది. దీంతో తనకు రావాల్సిన రూ.677.32 కోట్లను రాబట్టుకోవడానికి ఆన్‌రాక్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కోరుతూ ఎన్‌సీఎల్‌టీలో ఎస్‌బీఐ దరఖాస్తు చేసింది. ఎస్‌బీఐ చర్యపై ఆన్‌రాక్‌.. హైకోర్టును ఆశ్రయించి ఎన్‌సీఎల్‌టీలో విచారణపై స్టే తెచ్చుకుంది. అయితే ఓటీఎస్‌ ప్రతిపాదనలో భాగంగా ఈ నెల 31లోగా రూ.275 కోట్లు చెల్లించాలని ఆన్‌రాక్‌కు హైకోర్టు స్పష్టం చేసింది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...