psycopk Posted May 14 Author Report Posted May 14 Turkey: డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! 14-05-2025 Wed 15:19 | International భారత్పై దాడులకు పాక్కు టర్కీ డ్రోన్లు, సైనిక సహకారం 'ఆపరేషన్ సిందూర్'లో ఇద్దరు టర్కీ సైనికుల మృతి చెందినట్లు వార్తలు కూల్చివేసిన డ్రోన్లు టర్కీ 'అసిస్ గార్డ్ సోంగర్' రకానికి చెందినవని నిర్ధారణ పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ బాసట భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్థాన్కు టర్కీ డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా, తమ సైనిక సిబ్బందిని కూడా పంపిందన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా, 'ఆపరేషన్ సిందూర్' పేరిట జరిగిన ఘటనల్లో టర్కీకి చెందిన సైనికులు పాల్గొన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పాకిస్థాన్, టర్కీల మధ్య రక్షణ ఒప్పందాలు ఊపందుకున్నాయి. భారత్పై దాడులే లక్ష్యంగా పాకిస్థాన్కు టర్కీ వందల సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్ల వినియోగంపై పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు టర్కీ సైనిక నిపుణులను ఇస్లామాబాద్కు పంపినట్లు వార్తలు తెలుస్తోంది. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత్ జరిపిన ప్రతిదాడుల్లో ఇద్దరు టర్కీ సైనికులు మరణించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఆపరేషన్ అనంతరం పాకిస్థాన్ సుమారు 300 నుంచి 400 డ్రోన్లను భారత భూభాగంపైకి ప్రయోగించగా, వాటిని భారత బలగాలు సమర్థవంతంగా కూల్చివేశాయి. ఈ డ్రోన్ల శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించగా, అవన్నీ టర్కీకి చెందిన 'అసిస్ గార్డ్ సోంగర్' రకం డ్రోన్లుగా నిర్ధారించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుంటారని తెలిసిందే. ఆయన అనేక అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించినప్పటికీ, ఎర్డోగాన్ మాత్రం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కలిసి సంఘీభావం తెలిపారు. ఉగ్రదాడిని ఖండించకపోగా, మృతుల కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. పహల్గామ్ దాడి అనంతరం ముస్లిం దేశాల్లో పాకిస్థాన్కు మద్దతుగా నిలిచినవి టర్కీ, అజర్బైజాన్ మాత్రమే కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. కశ్మీర్ అంశంలో కూడా ఎర్డోగాన్ పలుమార్లు భారత్పై విమర్శలు చేశారు. Quote
psycopk Posted May 14 Author Report Posted May 14 Kapil Surana: యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! 14-05-2025 Wed 15:03 | National పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్ కు టర్కీ మద్దతు ఆపరేషన్ సిందూర్ సమయంలో డ్రోన్లు అందజేత టర్కీ అంటేనే మండిపడుతున్న భారతీయులు ఇప్పటికే టర్కీ యాపిల్స్ దిగుమతి నిలిపివేసిన పుణే వ్యాపారులు ఇప్పుడు మార్బుల్స్ దిగుమతి నిలిపివేతకు ఉదయ్ పూర్ వ్యాపారుల నిర్ణయం భారత-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్థాన్కు మద్దతుగా నిలుస్తున్న టర్కీకి వాణిజ్యపరంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పుణేలోని వ్యాపార వర్గాలు టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతులను నిలిపివేయగా... అదే కోవలో రాజస్థాన్లోని ఉదయ్పూర్ మార్బుల్ వ్యాపారులు టర్కీ నుంచి మార్బుల్ దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య ద్వారా భారత ప్రభుత్వానికి తమ సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు, దేశీయ మార్బుల్ పరిశ్రమకు ఊతమివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్ ఎగుమతి కేంద్రంగా పేరుగాంచిన ఉదయ్పూర్లో, మార్బుల్ ప్రాసెసర్స్ కమిటీ ఈ మేరకు కీలక తీర్మానం చేసింది. కమిటీ అధ్యక్షుడు కపిల్ సురానా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, "పాకిస్థాన్కు టర్కీ అందిస్తున్న మద్దతును నిరసిస్తూ, మా కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా టర్కీతో వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించారు" అని తెలిపారు. భారతదేశానికి దిగుమతి అయ్యే మొత్తం మార్బుల్లో దాదాపు 70 శాతం టర్కీ నుంచే వస్తుందని ఆయన గుర్తుచేశారు. ఈ నిర్ణయం కేవలం ఉదయ్పూర్కే పరిమితం కాకూడదని సురానా ఆకాంక్షించారు. "దేశంలోని అన్ని మార్బుల్ సంఘాలు టర్కీతో వాణిజ్యాన్ని నిలిపివేస్తే, అది ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని పంపుతుంది. భారత ప్రభుత్వం ఒంటరి కాదని, దేశంలోని పరిశ్రమలు మరియు యావత్ భారతీయులు ప్రభుత్వానికి అండగా నిలుస్తారని స్పష్టమవుతుంది," అని ఆయన అభిప్రాయపడ్డారు. టర్కీతో వాణిజ్యం నిలిచిపోవడం వల్ల భారతీయ మార్బుల్కు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని, తద్వారా దేశీయ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని కపిల్ సురానా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 'బాయ్కాట్ టర్కీ' పిలుపు ఇతర రంగాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్య టర్కీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు, అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్కు మద్దతిచ్చే దేశాలకు ఒక హెచ్చరికగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను కలిసి మద్దతుగా నిలిచారు. అంతేకాదు, ఓ సైనిక రవాణా విమానం నిండా డ్రోన్లను పాక్ కు అందించినట్టు కథనాలు వచ్చాయి. భారత్ కూల్చిన డ్రోన్లలో టర్కీ తయారీ అసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్ల శకలాలు కనిపించడం పాక్ కు టర్కీ సైనిక సాయం నిజమేనని నిర్ధారిస్తోంది. ఈ పరిణామం టర్కీ పట్ల భారత్ లో తీవ్ర వ్యతిరేకతను రాజేస్తోంది. Quote
psycopk Posted May 14 Author Report Posted May 14 Puran Kumar Sha: పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల 14-05-2025 Wed 12:04 | National అట్టారీ బార్డర్ వద్ద పూర్ణం షాను భారత్ కు అప్పగించిన పాక్ ఏప్రిల్ 23న పొరపాటున సరిహద్దు దాటిన జవాన్ పూర్ణం కుమార్ షా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో విడుదల ఆలస్యం గత నెల పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. పాక్ రేంజర్లు బుధవారం ఆయనను భారత అధికారులకు అప్పగించారు. పంజాబ్లోని అమృత్సర్ అట్టారీ జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఈ అప్పగింత కార్యక్రమం జరిగింది. "ఏప్రిల్ 23 నుంచి పాకిస్థాన్ రేంజర్ల కస్టడీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను ఉదయం సుమారు 10:30 గంటలకు అట్టారీ చెక్ పోస్ట్ ద్వారా భారత్కు అప్పగించారు. ఈ ప్రక్రియ నిర్దేశిత ప్రొటోకాల్స్ ప్రకారం శాంతియుతంగా జరిగింది" అని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పూర్ణం కుమార్ షా (40) పంజాబ్లోని ఫిరోజ్పూర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 23న ఆయన పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించారు. కాగా, అంతకు ఒకరోజు ముందే జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మరణించారు. ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ కారణంగా పూర్ణం కుమార్ షా విడుదల ప్రక్రియ ఆలస్యమైంది. Quote
psycopk Posted May 14 Author Report Posted May 14 Narendra Modi: ఈ నెల 25న ప్రధాని మోదీ కీలక సమావేశం .. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ 14-05-2025 Wed 10:59 | National ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 24 ఎన్డీఏ కీలక భేటీ ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలపై చర్చించే అవకాశం ఆపరేషన్ వివరాలను నేతలకు వెల్లడించనున్న ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్తో దాయాదికి చుక్కలు చూపించిన తర్వాత ఎన్డీఏ కీలక భేటీ కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 25న సమావేశం జరగనుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని ఎన్డీఏ నేతలకు వివరించనున్నట్లు సమాచారం. ఆపరేషన్లో ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడుల గురించి వివరించే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి. ప్రతిపక్ష నేతలు సైతం ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. అయితే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాలపై ఎన్డీఏ నేతలకు అవగాహన కల్పించడం ద్వారా విమర్శలను తిప్పికొట్టేలా చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎన్డీఏ కీలక భేటీ జరగనుంది. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేయనున్నారు. ఈ కీలక భేటీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు సమాచారం. Quote
psycopk Posted May 14 Author Report Posted May 14 S-400 Missile System: ఎస్400 ధ్వంసం చేశామంటిరి కదా.. తమ దేశ సైన్యాన్ని నిలదీసిన పాక్ జర్నలిస్ట్ 14-05-2025 Wed 10:17 | International భారత ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్ బేస్ పర్యటన ఫొటోతో ట్వీట్ మోదీ వెనక ఎస్400 క్షిపణి విధ్వంసక వ్యవస్థ కనిపిస్తోందని వెల్లడి పాక్ సైన్యం (డీజీ-ఐఎస్పీఆర్) తప్పుడు ప్రచారం చేసిందన్న పాక్ జర్నలిస్టు పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన పర్యటన, పాకిస్థాన్ సైన్యం ప్రచారంలోని డొల్లతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. తాము జరిగిన ఘర్షణల సమయంలో ఈ వైమానిక స్థావరాన్ని, అక్కడి ఎస్-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామని గొప్పలు చెప్పుకున్న పాకిస్థాన్ వాదనలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్కు చెందిన ఒక జర్నలిస్టు స్వయంగా తమ దేశ సైనిక అధికార ప్రతినిధి (డీజీ-ఐఎస్పీఆర్) అహ్మద్ షరీఫ్ చౌదరిపై విరుచుకుపడ్డారు. తప్పుడు విజయాలు ప్రకటించుకుంటున్నారని, వాస్తవానికి భారత దళాలు పాకిస్థాన్లోని కీలక స్థావరాలపై దాడులు చేశాయని ఆయన అంగీకరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, సదరు పాకిస్థానీ జర్నలిస్టు ఆదంపూర్ ఎయిర్బేస్లో ఎస్-400 క్షిపణి వ్యవస్థ ముందు నిలబడి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని చూపుతూ మాట్లాడారు. "ఈ స్థావరాన్ని, ఈ ఎస్-400 వ్యవస్థను మేం నాశనం చేశామని చెప్పుకున్నాం. కానీ, నరేంద్ర మోదీ అదే ఎస్-400 ముందు నిలబడి తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మేం గెలవలేదు. 1971 తర్వాత భారతదేశం పాకిస్థాన్లోని ప్రతి నగరం, ప్రతి స్థావరంపై దాడి చేయగలదని నిరూపించింది. మీ దేశంలో ఏ మూల కూడా సురక్షితం కాదని మోదీ పాకిస్థాన్కు గట్టి సందేశం ఇచ్చారు," అని ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. మోదీ తమ నీటి సరఫరాను నిలిపివేశారని, తమవారిలో 50 మందిని హతమార్చారని కూడా ఆయన ఆరోపించారు. Quote
psycopk Posted May 14 Author Report Posted May 14 Narendra Modi: ప్రధాని మోదీ ప్రసంగంపై పాకిస్థాన్ ఏమన్నదంటే....! 13-05-2025 Tue 22:03 | International ఆపరేషన్ సిందూర్ విజయంపై సోమవారం నాడు మోదీ ప్రసంగం మోదీ వ్యాఖ్యలను రెచ్చగొట్టేవి, వివాదాస్పదమైనవిగా పేర్కొన్న పాక్ అయినప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి భారత సాయుధ బలగాలు పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' విజయం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు చేసిన ప్రసంగం, పాకిస్థాన్కు ఆయన జారీ చేసిన హెచ్చరికలు ఇరు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధానికి దారితీశాయి. మోదీ వ్యాఖ్యలను 'రెచ్చగొట్టేవి, వివాదాస్పదమైనవి'గా పేర్కొంటూ పాకిస్థాన్ ప్రభుత్వం నేడు తీవ్రంగా ఖండించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా పూర్తిచేసిన భారత సాయుధ బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్లో కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమయ్యారని, 'అత్యంత కీలక' లక్ష్యాలు అనదగ్గ కొందరు ఉగ్రవాదులు కూడా మృతుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. పాకిస్థాన్పై ప్రతీకార చర్యలను భారత్ కేవలం విరామం ఇచ్చిందని, పూర్తిగా ముగించలేదని మోదీ గట్టిగా హెచ్చరించారు. కాల్పుల విరమణకు తొలుత ఇస్లామాబాదే కాళ్లబేరానికి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. "ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు, ఉగ్రవాదం, వాణిజ్యం ఒకేసారి నడవవు, అలాగే నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు" అని మోదీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. "భారత ప్రధాని చేసిన రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలను పాకిస్థాన్ తిరస్కరిస్తోంది" అని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపింది. "ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం" అని పేర్కొంది. "భారత్ కూడా ప్రాంతీయ స్థిరత్వానికి, తమ పౌరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం" అని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగినా పూర్తిస్థాయిలో ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించింది. మంగళవారం నాడు కూడా ప్రధాని మోదీ పాకిస్థాన్కు మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, భారత్లో మరో ఉగ్రదాడికి పాకిస్థాన్ అనుమతిస్తే మట్టికరవక తప్పదని హెచ్చరించారు. "భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది, కానీ దాడి జరిగితే శత్రువును తుదముట్టించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది" అని మోదీ ఉద్ఘాటించారు. Quote
psycopk Posted May 14 Author Report Posted May 14 Pakistani Diplomat Expelled: పాక్ హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన భారత్... ఎందుకంటే? 13-05-2025 Tue 22:03 | International అధికార హోదాకు విరుద్ధమైన కార్యకలాపాలే కారణమని వెల్లడి 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత విదేశాంగ శాఖ ఆదేశం భారత్లోని పాక్ వ్యవహారాల అధికారికి అధికారిక సమాచారం ఉద్యోగి పేరును ప్రభుత్వం గోప్యంగా ఉంచిన వైనం భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న సమయంలో, దౌత్యపరంగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఒక అధికారిని తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన కార్యకలాపాలు దౌత్య హోదాకు అనుగుణంగా లేవన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, తన అధికారిక హోదాకు తగని కార్యకలాపాల్లో నిమగ్నమైనట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. దౌత్యపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ, కార్యాలయ పరిధిని దాటి వ్యవహరించినందున ఆయనను దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సదరు పాకిస్థానీ అధికారి 24 గంటల్లోగా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని భారత్లోని పాకిస్థాన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అత్యున్నత అధికారికి అధికారికంగా తెలియజేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, బహిష్కరణకు గురైన ఉద్యోగి పేరును, ఆయన హోదాను మాత్రం ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసే ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. Quote
psycopk Posted May 14 Author Report Posted May 14 India: భారత రక్షణ రంగ ఎగుమతుల్లో రికార్డు స్థాయి పెరుగుదల 14-05-2025 Wed 16:21 | National మేక్ ఇన్ ఇండియా' సత్తా... రక్షణ ఎగుమతుల్లో కొత్త శిఖరాలు భారత్ రక్షణ ఎగుమతుల్లో 34 రెట్ల వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.23,622 కోట్ల ఎగుమతులు 2013-14లో కేవలం రూ.686 కోట్లుగా ఉన్న ఎగుమతులు భారత రక్షణ రంగం 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తితో అద్భుత ప్రగతి సాధిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఎగుమతులు రూ.23,622 కోట్లకు (సుమారు $2.76 బిలియన్లు) చేరి చారిత్రక రికార్డు సృష్టించాయి. ఇది దేశ రక్షణ చరిత్రలోనే అత్యధికం కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.21,083 కోట్లుగా ఉన్న ఎగుమతులు, ఈ ఏడాది 12.04% వృద్ధిని నమోదు చేశాయి. 2013-14లో కేవలం రూ.686 కోట్లుగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు ఏకంగా 34 రెట్లు పెరగడం 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమ పటిష్టతకు నిదర్శనమని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం భారత్ సుమారు 80 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండగా... 2029 నాటికి ఈ ఎగుమతులను రూ.50,000 కోట్లకు చేర్చాలని రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్' భారత ఆయుధ వ్యవస్థల నాణ్యతను, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, రక్షణ రంగ ఎగుమతుల్లో ప్రైవేటు సంస్థల వాటా రూ.15,233 కోట్లు కాగా, ప్రభుత్వ రంగ సంస్థలు (DPSUs) రూ.8,389 కోట్ల విలువైన ఉత్పత్తులను అందించాయి. ముఖ్యంగా DPSUల ఎగుమతి పనితీరు గత ఏడాదితో పోలిస్తే 42.85% పెరగడం భారత రక్షణ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆమోదాన్ని సూచిస్తోంది. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం విధానపరమైన సరళీకరణలు, ఆన్లైన్ అనుమతి వేదికలు వంటి అనేక చర్యలు చేపట్టింది. మందుగుండు సామగ్రి, ఆయుధాలు, విడిభాగాలు వంటి అనేక రకాల సైనిక పరికరాలను భారత్ విజయవంతంగా ఎగుమతి చేస్తోంది. ఈ గణనీయమైన వృద్ధి, దిగుమతులపై ఆధారపడే స్థాయి నుంచి రక్షణ ఉత్పత్తుల తయారీదారుగా, ఎగుమతిదారుగా భారత్ రూపాంతరం చెందుతోందనడానికి నిదర్శనం. Quote
psycopk Posted May 14 Author Report Posted May 14 MT Siren II: నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ 14-05-2025 Wed 14:59 | National ఒడిశా పరదీప్ పోర్టుకు పాక్ సిబ్బందితో నౌక 'ఎమ్టీ సైరెన్ II'లో 21 మంది పాకిస్థానీలు భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ భద్రత కట్టుదిట్టం ముడి చమురు అన్లోడ్ వరకు సిబ్బందికి నిర్బంధం ఒడిశాలోని పరదీప్ ఓడరేవులో బుధవారం ఉదయం ఒక నౌక రాకతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. పాకిస్థాన్కు చెందిన 21 మంది సిబ్బంది ఈ నౌకలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. 'ఎమ్టీ సైరెన్ II' అనే పేరుగల ఈ వాణిజ్య నౌక దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా పరదీప్ పోర్టుకు చేరుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కోసం ఈ నౌక ముడి చమురును రవాణా చేస్తోంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా, సాధారణ తనిఖీల్లో భాగంగా వారిలో 21 మంది పాకిస్థానీయులని అధికారులు గుర్తించారు. ఈ సమాచారం ఇమిగ్రేషన్ అధికారుల ద్వారా వెలుగులోకి రావడంతో, ఒడిశా మెరైన్ పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా దుహేరి వెల్లడించిన వివరాల ప్రకారం, పోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను గణనీయంగా పెంచారు. ప్రస్తుత సున్నిత పరిస్థితుల దృష్ట్యా, ఓడరేవు ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించి, పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ నౌక, పోర్టుకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పీఎమ్ బెర్త్’ వద్ద లంగరు వేసి ఉంది. ఇందులో సుమారు 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. నౌక నుంచి ముడి చమురును పూర్తిగా అన్లోడ్ చేసే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు, సిబ్బందిలో ఎవరూ నౌకను విడిచి కిందకు దిగడానికి అనుమతి లేదని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.