kakatiya Posted January 12, 2021 Report Posted January 12, 2021 దొంగ దైవమయ్యాడు. అక్షరాలు నేర్వనివాడు న్యాయదేవతకి రక్షకుడయ్యాడు. అబద్ధం చెప్పాలంటూ శరీరాన్ని నుజ్జునుజ్జుచేసినా... లక్షల రూపాయలు ఎరచూపినా నిజంవైపే నిష్ఠగా నిలిచాడు. అందుకే 28 ఏళ్లపాటు సాగిన అభయ హత్యకేసు తీర్పులో న్యాయస్థానం ఈ మాజీ దొంగని వేనోళ్లా ప్రశంసించింది! కేరళ సమాజం చేతులెత్తి నమస్కరించిన ‘అడక్కా’ రాజు కథ కాని కథ ఇది... Quote
kakatiya Posted January 12, 2021 Author Report Posted January 12, 2021 అభిలాష్ థియేటర్లో సెకండ్ షో చూస్తున్న ‘అడక్కా’ రాజు ధ్యాస సినిమాపైన లేదు. ఆ సినిమా విడిచాక... తాను చేయబోతున్న దొంగతనం గురించే ఆలోచిస్తున్నాడు. మూడురోజులుగా తాను రెక్కీ నిర్వహిస్తున్న ‘సెయింట్ పయస్ టెన్త్ కాన్వెంట్’ పరిసరాలనే గుర్తు చేసుకుంటున్నాడు. కేరళలోని కొట్టాయం నగరంలో సిరియన్ కేథలిక్ డయాసిస్కి చెందిన ఉద్యోగినులూ, విద్యార్థినులూ ఉండే హాస్టల్ అది. ఆ భవంతిపైన పిడుగుని నిరోధించే కంభంపైనుండే రాగి తీగపైన రాజు కన్నుపడింది! రాజు ఎప్పుడూ అంతే... పెద్దపెద్ద వస్తువులూ, బంగారు నగలవైపు వెళ్లడు. చిన్నాచితకా రాగి వస్తువులూ, నీటి మీటర్లూ చోరీ చేస్తాడు. అవి దొరక్కుంటే కొట్టాయంలో ప్రధాన వాణిజ్యసాగైన పోకచెట్లనెక్కి వక్కల్ని దొంగిలిస్తాడు. మలయాళంలో వక్కని ‘అడక్కా’ అంటారు. వాటి దొంగతనంలో అతని చేతివాటం తిరుగులేనిది కాబట్టే అతణ్ణి పోలీసులు ‘అడక్కా’ రాజు అని పిలుస్తారు. పగలంతా ఎవరికీ అనుమానం రాకుండా చెట్లెక్కి కొబ్బరికాయలు కోసే పనిచేస్తాడు. మార్కెట్లో హమాలీగానూ ఉంటాడు! 26 మార్చి 1992న... సెకెండ్ షో ముగిసి రోడ్లపైన సందడి తగ్గాక మెల్లగా కాన్వెంట్ దగ్గరకెళ్లాడు రాజు. దక్షిణంవైపు కాంపౌండ్ గోడ పక్కనున్న చెట్టుపైకెక్కి లోపలికి దూకబోతుండగా.... అతని కళ్లపడ్డారు ఇద్దరు వ్యక్తులు! చేతిలో టార్చ్తో గ్రౌండ్ఫ్లోర్ మెట్లమీద నుంచి సెల్లార్లోకి దిగుతూ కనిపించారు. అందులో ఒకరు ఫాదర్ థామస్ కోట్టూర్. కొట్టాయంలో థామస్ ఓ చిన్నసైజు ప్రముఖుడు. అక్కడి బీసీఎం కాలేజీలో సైకాలజీ లెక్చరర్. కొట్టాయం ఆర్చ్ బిషప్కి సెక్రటరీగానూ ఉంటాడు. వాళ్లని చూసి రాజు ఉలిక్కిపడ్డాడు ‘ఏ మగపురుగునీ లోపలికి రానివ్వని అమ్మాయిల హాస్టల్లోకి ఈ ఇద్దరూ ఎలా వచ్చారు... అదీ ఈ జామున!’ అనుకున్నాడు. ఆ ఇద్దరూ తిరిగి వెళ్లేదాకా వేచి చూద్దామనుకున్నాడు. 5.30 దాకా వాళ్లు బయటకు రాలేదు... ఈలోపు హాస్టల్ సైరన్ మోగింది! ‘ఛ... ఈరోజూ వృధా అయిపోయింది’ అనుకుంటూ రాజు ఇంటిదారి పట్టాడు. అతనికి అప్పుడు తెలియని విషయమేమిటంటే... అతనికెదురుగా ఉన్న భవనానికి ఆవలివైపు ఓ అమాయకురాలు ఘోరహత్యకు గురవుతోందీ అనీ, ఆ ఘటన మరో పాతికేళ్లపాటు తననీ తన కుటుంబాన్నీ నిజమనే నిప్పుల పైన నడిచేలా చేస్తుందీ అనీ! 1 Quote
kakatiya Posted January 12, 2021 Author Report Posted January 12, 2021 ఆ అమ్మాయి పేరు బీనా. కొట్టాయం నుంచి గంట దూరంలో ఉన్న ఆరిక్కరై గ్రామం తన సొంతూరు. తండ్రి థామస్ మత్తయి. తల్లి లీలమ్మ. బీనాకి భక్తి ఎక్కువ. ఎనిమిదో తరగతి నుంచే నన్గా వెళతానని చెబుతుండేది. ఆ మేరకే 1990లో తన 17 ఏళ్ల వయసులో ‘కొట్టాయం జ్ఞానానయ కేథలిక్ డయాసిన్లో నన్గా మారింది. తన పేరుని ‘సిస్టర్ అభయ’గా మార్చుకుంది. అక్కడి బీసీఎం కాలేజీలో ప్రీడిగ్రీలోనూ చేరింది. రోజూ ప్రార్థన, బైబిల్ పఠనం, చదువు... ఇవి తప్ప అభయకి మరో ప్రపంచం తెలియదు. 27న తనకి పరీక్షలున్నాయి. 26 రాత్రి 8.30కే నిద్రకుపక్రమిస్తూ ఉదయానే 4.00 గంటలకి లేపమని తన సీనియర్ సిస్టర్ షెరీల్కి చెప్పి పడుకుంది. షెరీల్ ఆ సమయానికే నిద్రలేపింది. లేచిన అభయ కాసేపు పుస్తకం ముందు కూర్చున్నాక ‘నీళ్లున్నాయా సిస్టర్!’ అని అడిగింది షెరీల్ని. ‘అయిపోయాయి. సెల్లార్లోని కిచెన్లో ఉంటాయి కానీ ఇప్పుడు వెళ్లొద్దు... కిచెన్లో ఎవ్వరూ ఉండరు!’ అని చెప్పి మళ్లీ పడుకుంది షెరీల్. అభయ కాసేపు కూర్చుంది కానీ... దాహం మరీ ఎక్కువైందేమో కిందకి వెళ్లింది. వెళ్లిన అమ్మాయి 5.15 దాకా రాలేదు! సిస్టర్ షెరీల్ అప్పటికి నిద్రలేచి అభయ కోసం చూస్తే... తను ఆ ఫ్లోర్లో ఎక్కడా లేదు. కిచెన్ ఇన్ఛార్జి సిస్టర్ అచ్చమ్మని లేపింది. కింద గదిలో ఉన్న సిస్టర్ షెఫీ కూడా అప్పటికే తన గది బయట ఉంది. అందరూ కలిసి కిచెన్ వద్దకెళ్లారు. అక్కడ వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. వంటచెరకుని కొట్టే చిన్న గొడ్డలి ఫ్రిజ్ కింద పడి ఉంది. కిచెన్ నుంచి భవనం వెలుపలి వైపుకి వెళ్లే తలుపులు మూసి ఉన్నాయి. ఆ తలుపు రెక్కలమధ్య అభయవాడే ‘ముసుగు’ ఇరుక్కుని ఉంది. ఆ తలుపుకింద అభయ చెప్పు కూడా ఉంది. అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఆమె కోసం కాంపౌండ్ అంతా వెతకడం మొదలు పెట్టారు. ఈలోగా అభయ తండ్రికి కబురంపితే ఆయన కూడా వచ్చాడు. పోలీసులూ రంగంలోకి దిగారు. సబ్ ఇన్స్పెక్టర్ అగస్టీన్... కాంపౌండ్ మొత్తాన్నీ జల్లెడపట్టాడు. చివరిగా బావిలోనూ చూస్తే... అక్కడ అభయ శవంగా తేలుతూ కనపడింది! తండ్రి భోరుమంటూ తలబాదుకున్నాడు. హాస్టల్లోని అమ్మాయిలందరూ కన్నీరుమున్నీరయ్యారు. ఆ తర్వాతి రోజే ‘బావిలో దూకి నన్ ఆత్మహత్య’ అంటూ పత్రికల్లో వార్తలొచ్చాయి. కానీ ఆమె తండ్రి థామస్ ఆ వార్తల్ని ఖండించాడు. అభయ తలవెనకాల రెండు బలమైన గాయాలున్నాయనీ, మెడకింద గోళ్ల గుర్తులూ ఉన్నాయనీ చెప్పాడు. ‘ఎప్పుడూ ఉత్సాహంగా నవ్వుతూ కనిపించే అభయ ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు. పోలీసులు ఏదో దాస్తున్నారు!’ అంటూ ఇతర నన్లందరూ ధర్నాకి దిగారు. వారంలోనే ఆ ఆందోళనలు కొట్టాయం నగరాన్ని దాటి... కేరళ మొత్తానికీ పాకాయి. దాంతో క్రైమ్ బ్రాంచ్ డీజీపీ దర్యాప్తుకి ఆదేశించారు. క్రైమ్ బ్రాంచ్ వాళ్లు మొదట చేసిన పని... అప్పటికే ఉన్న ఆధారాలన్నింటినీ ధ్వంసం చేయడం! Quote
kakatiya Posted January 12, 2021 Author Report Posted January 12, 2021 * * * హంతకుల్ని పట్టిస్తాయనుకున్న అభయ దుస్తులూ, ఆమె చెప్పూ వంటివాటిని లేకుండా చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అంతేకాదు, అభయ శవం ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్- వాళ్లకి పది ఫొటోలిస్తే అందులో నాలుగు దాచేశారు. ఆ నాలుగూ అభయ మెడకింద గోళ్ల గాయాల్ని చూపేవే! పనిలోపనిగా శవం పంచనామా నివేదికనీ మార్చారు. అవి సరిపోకా, అసలు నిందితుల్ని కాపాడటానికి వాళ్లకో బలిపశువు అవసరమయ్యాడు. ఆ బలిపశువు... ‘అడక్కా రాజు’ రూపంలో వాళ్లకి కనిపించాడు. అభయ చనిపోయి అప్పటికి వారం రోజులు. ఆమె నేపథ్యం గురించీ... ఆందోళనల గురించీ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అవి విన్న రాజు ఎవరి దగ్గరో ‘అరె... నేను ఆ రోజు అక్కడే ఉన్నా. ఫాదర్ కోట్టూరునీ చూశా!’ అన్నాడు. ఆ మాటలు ఓ పత్రిక విలేకరి చెవిలో పడ్డాయి. ‘కాంపౌండ్లో ఫలానా ఫాదర్ని ఆ రోజు ఓ దొంగ చూశాడట’ అని పత్రికల్లో వార్త వచ్చింది. అంతే... క్రైం బ్రాంచి పోలీసులు రాజుని అదుపులోకి తీసుకున్నారు. * * * Quote
kakatiya Posted January 12, 2021 Author Report Posted January 12, 2021 కేసు సీబీఐ చేతికొచ్చిన మూడునెలల్లోనే సీబీఐ డీఎస్పీ థామస్ పి.కురియన్ అభయది ముమ్మాటికీ హత్యేనని తేల్చి... ప్రాథమిక నివేదిక అందించాడు. మూడునెలల తర్వాత ఆయన ప్రత్యేకంగా మరో విలేకర్ల సమావేశం నిర్వహించాడు. ‘నేనీ కేసు నుంచి తప్పుకుంటున్నాను. అంతేకాదు, నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. నాపై అధికారి ఈ కేసుని ఆత్మహత్యేనని చెప్పమంటున్నాడు... అది నాకు నచ్చట్లేదు!’ అని కుండబద్దలు కొట్టాడు. ఈ ప్రకటన అప్పట్లో దేశాన్ని ఊపేసింది. పార్లమెంటులోనూ చర్చకు దారితీసింది. ఇంత జరిగినా 1996లో సీబీఐ ఇది ఆత్మహత్యేనంటూ ప్రకటించి... కేసు మూసేయాలంటూ కోర్టుకి నివేదించింది. దాంతో కేరళ అట్టుడికిపోయింది. మాజీ ముఖ్యమంత్రి ఈకే నయనార్ వంటివాళ్లు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. కోర్టు సీబీఐని తీవ్రంగా మందలించింది. ‘సమగ్రంగా విచారణ జరపండి!’ అంటూ హుకుం జారీచేసింది. మరో మూడేళ్లు సాగించిన సీబీఐ ‘హత్యేనని తెలుస్తోంది... కానీ దోషులెవరో తేల్చుకోలేకపోతున్నాం!’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. అప్పుడే కాదు... 1999లోనూ, 2005లోనూ ఇదే పాట పాడింది! ప్రతిసారీ న్యాయస్థానం తలంటుతూనే వచ్చింది. చివరికి... 2007లో సీబీఐ కాస్త నిజాయతీగా ప్రయత్నించడం మొదలుపెట్టింది! Quote
kakatiya Posted January 12, 2021 Author Report Posted January 12, 2021 * * * 1993-2007 దాకా సీబీఐ తూతూమంత్రంగా కేసుని విచారించినప్పటి నుంచీ అడక్కా రాజుని ‘విచారిస్తూనే’ వచ్చారు. అప్పటికే పత్రికల్లో అతని పేరు మారుమోగి పోతోంది. దొంగతనాలు పూర్తిగా మానేేశాడు. కానీ బడికెళితే పిల్లల్ని అందరూ ‘దొంగోడి కూతుళ్లు’ అని వేలెత్తిచూపడం, ఈసడించడం మొదలు పెట్టారు. ఇళ్ల పనులకెళ్లే భార్యకీ ఉపాధి పోయింది. ‘ఓ దశలో అటు సీబీఐ వాళ్ల పోరూ, ఇటు చుట్టుపక్కల చిన్నచూపూ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని పించింది. అప్పుడు నా భార్యే అడ్డుకుంది... నువ్వు చస్తే అభయని నువ్వే చంపావని తేల్చేస్తారు. ఆ అమ్మాయి కోసమైనా బతుకు!’ అని చెప్పింది. నేను విచారణ కెళ్లిన ప్రతిసారీ నన్ను చంపేస్తారేమోనన్న భయం నన్ను పీడిస్తుండేది. దాంతో మా ఆవిడ నా ఇద్దరు కూతుళ్లనీ తోడుగా పంపించేది... వాళ్ల మొహం చూసైనా దయతలుస్తారేమోననే ఆశ తనది! అయినా పోలీసులు కొట్టడం మానలేదు!’ అంటాడు రాజు. కానీ 2007 తర్వాత సీబీఐ ధోరణి మారింది. అడక్కా రాజుని ప్రధాన సాక్షి(ప్రాసిక్యూషన్ విట్నెస్ 3)గా తీసుకుంది. రాజుతోపాటూ పయస్ కాన్వెంట్ పొరుగున ఉన్న సంజు మ్యాథ్యూ అనే అతనూ బలమైన సాక్షిగా మారాడు. సంఘటన జరిగిన రోజు రాత్రి ఫాదర్ థామస్ స్కూటర్ని కాన్వెంట్ బయట చూశానని చెప్పాడతను. దాంతో తొలిసారి సీబీఐ 2007లో ఫాదర్ కోట్టూరు, సిస్టర్ షెఫీ, వాళ్లతోపాటూ ఉన్నట్టు చెబుతున్న జోసెఫ్ పూత్రకయిల్లకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేసింది. ఏడాది తర్వాత 2008లో ఆ ముగ్గుర్నీ అరెస్టు చేశారు! అభయ హత్య జరిగిన పదహారేళ్ల తరవాత జరిగిన అరెస్టు అది! ఆ తర్వాత న్యాయస్థానాల జోక్యాలూ, నిందితులకి బెయిల్లూ, సుప్రీంకోర్టులో అప్పీళ్లూ, విచారణలూ, స్టేలూ వగైరాలెన్నో చోటుచేసుకున్నాయి. అప్పుడే- ఈ కేసుని మొదట విచారించిన ఇన్స్పెక్టర్ ఆగస్టిన్ ఉన్నపళంగా ఆత్మహత్య చేసుకున్నాడు! బయటకి ‘అభయది ఆత్మహత్య’ అని చెబుతూ వచ్చిన అతను... తన డైరీలో అది ‘హత్య’ అని రాసుకుని ఉండటం బయటపడింది. వీటన్నింటితో పదకొండేళ్ల తర్వాత 2019 ఏప్రిల్లో కొట్టాయం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో తుది విచారణ మొదలైంది. సీబీఐ తన ఛార్జిషీటులో 1993 మార్చి 27 ఉదయం 4:00 తర్వాత... పయస్ కాన్వెంట్లో ఏం జరిగిందో వివరించింది... 1 Quote
kakatiya Posted January 12, 2021 Author Report Posted January 12, 2021 నీళ్ల కోసం కిందకొచ్చిన అభయ కిచెన్లో లైటు వేయగానే... అప్పటిదాకా చీకట్లో ఉన్న సిస్టర్ షెఫీ, ఫాదర్ థామస్ కోట్టూర్, జోసెఫ్ పుత్రకాయల్ ఉలిక్కిపడి చూశారు. బ్రహ్మచర్య దీక్షతో దేవుని సేవలో ఉన్నట్టు ప్రపంచాన్ని నమ్మిస్తూ వచ్చిన ఆ ముగ్గురూ... సామూహికంగా లైంగిక కోరికలు తీర్చుకుంటున్నారు. తన కాలేజీ లెక్చరర్లనీ, కాన్వెంట్లోని సిస్టర్నీ అలా చూసి స్థాణువై పోయింది అభయ. పరుగెత్తి రూమ్కి వెళ్లబోతున్న ఆమెని జోసెఫ్, థామస్లిద్దరూ కదలకుండా పట్టుకున్నారు. షెఫీ అక్కడున్న చిన్న గొడ్డలితో అభయ తలపైన రెండుసార్లు బాదింది. ఆ దెబ్బకి కుప్పకూలిన ఆమెని మొదట టెర్రస్పైకి తీసుకెళ్లి తోసేయాలనుకున్నారు. మోసుకెళ్లడం కుదరక... పక్కనున్న బావిలో పడేశారు. అప్పటికి అభయ ప్రాణాలతోనే ఉంది..! * * * Quote
kakatiya Posted January 12, 2021 Author Report Posted January 12, 2021 సీబీఐ చూపిన ప్రతి సాక్ష్యాన్నీ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు నిందితులు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ని ప్రధాన సాక్ష్యంగా తీసుకోలేరని వాదించి నెగ్గారు. జోసెఫ్ పుత్రకాయల్ తనకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం లేదంటూ నిరూపించి విడుదలయ్యాడు. అంతేకాదు, అభయకి న్యాయం జరగాలంటూ పోరాడిన ఆమె రూమ్మేట్స్ సిస్టర్ షెరీల్, సిస్టర్ అనుపమ, కిచెన్ ఇన్ఛార్జి అచ్చమ్మ... అందరూ ప్లేటు ఫిరాయించారు. కాన్వెంట్కి పొరుగున ఉంటూ ఆ రోజు రాత్రి ఫాదర్ జోసెఫ్ స్కూటర్ని చూశానని చెప్పిన సంజూ మాథ్యూ ‘సీబీఐ బెదిరించడం వల్లే అలా చెప్పాను’ అన్నాడు. అవన్నీ పోగా- సీబీఐ దగ్గర మిగిలిన ఆధారాల్లో రెండు కీలకమైనవి. ఒకటి- తన కన్యాత్వం చెరిగిపోలేదని నిరూపించుకోవడానికి సిస్టర్ షెఫీ 2007లోనే హైమనోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నట్టు దొరికిన ఆధారం. ఇంకొకటి- అడక్కా రాజు సాక్ష్యం! రాజుని రెండురోజులపాటు డిఫెన్స్ లాయర్లు ఎన్నెన్నో రకాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. రకరకాలుగా గందరగోళపరిచారు. ఎంత చేసినా- థామస్ కోట్టూరుని చూసింది మాత్రం నిజమని బల్లగుద్ది చెప్పాడు రాజు. అక్షరాలు రానివాడి మొండితనాన్నే నమ్మింది కోర్టు. 2020 డిసెంబర్ 22న ఇచ్చిన తీర్పులో 28 ఏళ్ల కేసుకి భరతవాక్యం పలికింది. థామస్నీ, షెఫీని దోషులుగా ప్రకటిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాజు 58 రోజులపాటు ఎదుర్కొన్న హింసనీ, పోలీసుల ప్రలోభాలనీ వివరించింది. అయినా సరే ఇసుమంతైనా మనసు మార్చుకోని అతని నిబ్బరాన్ని అభినందించింది. ‘రాజు దొంగే కావొచ్చు... కానీ అతను నిజాయతీపరుడు. మనసులో ఉన్నది దాచుకోవడం తెలియని అతి సామాన్యుడు. తన పరిస్థితుల కారణంగా దొంగతనాలు చేసుండొచ్చు... అయినా సత్యం వైపేనిలిచాడు!’ అంటూ కొనియాడింది. మనదేశంలో ఎన్ని న్యాయస్థానాలు ఓ దొంగని ఇంతగా అభినందించి ఉంటాయి..! Quote
kakatiya Posted January 12, 2021 Author Report Posted January 12, 2021 కేసులో రాజుతోపాటు చెప్పుకోదగ్గ మరో ముఖ్యమైన హీరో- జొమోన్ పూతేన్పురక్కల్! అభయ కేసు విషయంలో ప్రభుత్వాన్నీ, సీబీఐనీ గత28 ఏళ్లుగా ములుగర్రలా పొడిచింది ఆయనే. సీబీఐ కుంటిసాకులు చెప్పి కేసుని మూసేయాలనుకున్నప్పుడల్లా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి కోర్టుకెక్కేవారు జొమోన్. అలా గత 28 ఏళ్లలో వేలసార్లు న్యాయస్థానాలకెళ్లారు... వందలాది పిటిషన్లు వేశారు. లక్షలాది రూపాయలు తన సొంత సొమ్ము ఖర్చు చేశారు. అభయ తల్లిదండ్రులు చనిపోయినా, ఆమె సోదరుడు కూడా మిన్నకుండిపోయినా... జొమోన్ ఒంటరిగా నిలిచి పోరాడారు. జొమోన్ చదువుకుంది ఆరో తరగతే. చిన్నప్పటి నుంచీ కూలీపనులు చేస్తూ వచ్చిన ఆయన కార్మిక సంఘాల ద్వారా యూత్ కాంగ్రెస్లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత కేరళకి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కేఈ మెమన్కి శిష్యుడయ్యారు. ఆయన సూచన మేరకే ‘అభయ కేస్ యాక్షన్ కౌన్సిల్’ ఏర్పాటుచేసి దానికి సమన్వయకర్త అయ్యారు! నిజానికి, ఈ కేసు నిందితులు ఫాదర్ థామస్ కోట్టూరు, షెఫీ... జొమోన్ ఒకే కేథలిక్ డయాసిస్కి చెందినవాళ్లే! ఓ రకంగా తన సొంత మత సంస్థపైనే పోరాడారు జొమోన్. దాంతో ఆయనపైన అన్నిరకాల ఒత్తిళ్లూ వచ్చాయి. ఒకదశలో జొమోన్ అన్నయ్య ఉట్టప్పన్ ఆయనపైన హత్యాయత్నానికీ దిగాడు! పక్కనుండేవాళ్లు సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లబట్టి సరిపోయింది కానీ లేకపోతే జొమోన్ ప్రాణం అక్కడే పోయేది. ఈకేసు తీర్పు వచ్చాక జొమోన్ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ ‘ఇక నేను చచ్చిపోవచ్చు... నా జీవితానికి ఇప్పుడొక అర్థం ఏర్పడింది!’ అన్నారు ఉద్వేగంతో Quote
kakatiya Posted January 12, 2021 Author Report Posted January 12, 2021 డిసెంబరు 23న ఈ కేసు తీర్పు వస్తే... 25న క్రిస్మస్. రాజుని ఆ దైవకుమారుడికి మరోరూపంగానే చూసింది కేరళ సమాజం! నిజం కోసం ఆ దేవుడిలాగే శిలువ మోశాడన్నాయి పత్రికలు. తీర్పు తర్వాత విలేకర్లందరూ తన ముందు మైక్ పెట్టినప్పుడు ‘అభయ నా బిడ్డలాంటిది. నా కూతురికి ఈరోజు న్యాయం జరిగింది’ అన్నాడు రాజు కళ్లనీళ్లతో. చివరగా, మరో అభ్యర్థనా చేశాడు ‘ఇకపైన నన్ను దొంగ అని రాయకండి సార్. నా పిల్లలూ, మనవళ్లూ ఇబ్బంది పడుతున్నారు!’ అని. THE END 1 Quote
Picheshwar Posted January 12, 2021 Report Posted January 12, 2021 అప్పటిదాకా చీకట్లో ఉన్న సిస్టర్ షెఫీ, ఫాదర్ థామస్ కోట్టూర్, జోసెఫ్ పుత్రకాయల్ ఉలిక్కిపడి చూశారు. బ్రహ్మచర్య దీక్షతో దేవుని సేవలో ఉన్నట్టు ప్రపంచాన్ని నమ్మిస్తూ వచ్చిన ఆ ముగ్గురూ... సామూహికంగా లైంగిక కోరికలు తీర్చుకుంటున్నారు. ఒకటి- తన కన్యాత్వం చెరిగిపోలేదని నిరూపించుకోవడానికి సిస్టర్ షెఫీ 2007లోనే హైమనోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నట్టు దొరికిన ఆధారం. Quote
Kool_SRG Posted January 12, 2021 Report Posted January 12, 2021 Pakkaga super cinema tiyochu... Super thriller. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.