Jump to content

Tg political heat


Recommended Posts

Posted

Priyanka Gandhi: పాలకుర్తి కాంగ్రెస్ సభలో క్షమాపణలు చెప్పిన ప్రియాంక గాంధీ! 

24-11-2023 Fri 16:06 | Telangana
  • పనులు వదులుకొని మరీ వచ్చారు.. అందుకే క్షమాపణలు చెప్పిన ప్రియాంక గాంధీ
  • కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నారు.. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని ఎద్దేవా
  • పేపర్ లీకేజీలను అరికడతామన్న ప్రియాంక గాంధీ
  • కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన
 
Priyanka Gandhi apology in Palakurthy public meeting

'నా కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు... మీ ఇంటి పనులు వదులుకొని మరీ వచ్చారు... మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా' అని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. పాలకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ... కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నారని, ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. మార్పు రావాలి... కాంగ్రెస్ రావాలని నినదించారు. కేసీఆర్ తాను ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చలేదన్నారు. రైతులకు రూణమాఫీ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మీ ఓటు చాలా విలువైనది... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల త్యాగాల వల్లే తెలంగాణ ఏర్పడిందని, అలాంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలని తాము భావించామన్నారు. కానీ ప్రజల ఆకాంక్షలు ఈ పదేళ్ల కాలంలో నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరాయా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయని హామీ ఇచ్చారు. ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? అని ప్రశ్నించారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షులు లీక్ కావడంతో యువతను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

పేపర్ లీకేజీలను అరికడతామని ప్రియాంక గాంధీ అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం వక్రీకరించిందని విమర్శించారు. ప్రతి మహిళ ఖాతాలో రూ.2500 వేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే రూ.500కు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతుకు ఏడాదికి రూ.15వేలు, వరికి కనీస మద్దతుతో పాటు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిందన్నారు. యువకుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నారు.

  • Replies 158
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    148

  • Vaaaampire

    3

  • jaathiratnalu2

    2

  • Spartan

    1

Top Posters In This Topic

Posted

Revanth Reddy: వాతావరణం అనుకూలించక వెనక్కి మళ్లిన రేవంత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ 

24-11-2023 Fri 16:15 | Telangana
  • హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన రేవంత్
  • వాతావరణం అనుకూలించపోవడంతో హైదరాబాద్ కు తిరుగుపయనం
  • రేపు, ఎల్లుండి తెలంగాణకు వర్ష సూచన
 
Revanth Reddy helicopter returned back to Hyderabad as weather not good

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. పలుచోట్ల వర్షాలు, గాలులు ప్రచారానికి అడ్డంకిగా మారుతున్నాయి. వాతావరణం అనుకూలించక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తిరుగుముఖం పట్టింది. ఈరోజు నాలుగు ప్రాంతాల్లో రేవంత్ ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన తర్వాత వాతావరణం అనుకూలించలేదు. దీంతో హెలికాప్టర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. అనంతరం రేవంత్ హైదరాబాద్ నుంచి నకిరేకల్ కు రోడ్డు మార్గంలో బయల్దేరారు. 

మరోవైపు  హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రియాంకాగాంధీ హెలికాప్టర్ లో పాలకుర్తికి వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆమె కూడా రోడ్డు మార్గంలోనే పాలకుర్తికి చేరుకున్నారు. ఇంకోవైపు, రేపు, ఎల్లుండి తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉంది. దీంతో నేతల ప్రచార సభలకు మరింత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి.

Posted

Amit Shah: కేసీఆర్ రజాకార్లకు భయపడి విమోచన దినం జరపడం లేదు: అమిత్ షా 

24-11-2023 Fri 15:41 | Telangana
  • కేసీఆర్ పదేళ్ల కాలంలో ప్రజల కోసం ఏమీ చేయలేదని, కేటీఆర్ కోసం వేలకోట్ల అవినీతి చేశారని ఆరోపణ
  • బీజేపీ పసుపు బోర్డు ఇచ్చిందని గుర్తు చేసిన కేంద్రమంత్రి
  • అధికారంలోకి రాగానే విమోచన దినం జరుపుతామని హామీ
  • కేసీఆర్ దళిత సీఎం హామీని విస్మరించారని, బీజేపీ మాత్రం బీసీని సీఎం చేస్తుందని వ్యాఖ్య
  • డబ్బులు ఎవరు ఎక్కువగా ఇస్తే వారికే మంత్రి పదవులు ఇస్తారని ఆరోపణ
 
Amit Shah public meeting in Armur

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పదేళ్ల కాలంలో ప్రజల కోసం ఏ పనీ చేయలేదని, కానీ తన కొడుకు కేటీఆర్ కోసం వేలాది కోట్ల రూపాయల అవినీతి మాత్రం చేశారని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదని, కానీ బీజేపీ ఇక్కడి ప్రజల కోసం పసుపు బోర్డు ఇచ్చిందని గుర్తు చేశారు. బీడీ వర్కర్ల కోసం ప్రత్యేక హాస్పిటల్, ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీని తెచ్చామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అధికారికంగా హైదరాబాద్ విమోచన దినం జరుపుతామని పునరుద్ఘాటించారు. ఓవైసీకి, రజాకార్లకు భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారని, కానీ బీజేపీ బీసీని ముఖ్యమంత్రిగా చేసి మాట నిలబెట్టుకుంటుందన్నారు.

జీఎస్టీలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకు వస్తున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు ఎక్కువగా ఎవరు ఇస్తే కేసీఆర్ మంత్రి వర్గంలో వారే ఉంటారని ఆరోపించారు. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించి, పేపర్ లీకేజీ ఘటనపై విచారణ చేసి జైలుకు పంపిస్తామన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌తో సుపరిపాలన సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌లో కేవలం మంత్రి పదవి పొందాలంటే ఢిల్లీలో చర్చించాలి అని.. అలాంటి పార్టీ అవసరమా? అని ప్రశ్నించారు.

Posted

Smriti Irani: కేసీఆర్ దగ్గర కారు మాత్రమే ఉంది.. స్టీరింగ్ వేరేవాళ్ల వద్ద ఉంది: స్మృతి ఇరానీ 

23-11-2023 Thu 19:31 | Telangana
  • రెండున్నరేళ్ల పాటు అర్హులైన పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నామన్న స్మృతి ఇరానీ
  • కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఉంటే ఇలాంటివి ఇచ్చి ఉండేవి కావని వ్యాఖ్య
  • బీజేపీ గెలిస్తే శుద్ధమైన మంచి నీరు, ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తామన్న స్మృతి ఇరానీ
 
Smriti Irani comments on brs and kcr government

కరోనా నేపథ్యంలో మరో రెండున్నరేళ్ల పాటు అర్హులైన పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నామని, కానీ కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఉంటే ఇలాంటివి ఇచ్చి ఉండేవి కావని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఆమె గురువారం ఖైరతాబాద్‌లోని ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ దగ్గర కేవలం కారు మాత్రమే ఉందని, స్టీరింగ్ మాత్రం వేరేవాళ్ల చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.

దళితబంధులో అసలైన లబ్ధిదారుల కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లబ్ధి పొందారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో మంచి నీటి సమస్య ఉందని, బీజేపీ అధికారంలోకి వస్తే శుద్ధమైన నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు వేయించారని గుర్తు చేశారు. ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

 

Posted

Pawan Kalyan: దుబ్బాకలో పవన్ కల్యాణ్ ప్రచారం.... సీఎం.. సీఎం అంటూ యువత నినాదాలు 

23-11-2023 Thu 20:07 | Telangana
  • తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రఘునందన్ రావును గెలిపించాలని విజ్ఞప్తి
  • బీజేపీ అభ్యర్థులను గెలిపించి బీసీని సీఎంగా చేసుకోవాలని పిలుపు
  • బీజేపీకి ఓటు వేసి ఉపాధి కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న పవన్ కల్యాణ్
 
Pawan Kalyan campaign in Dubbaka

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావున మరోసారి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని దుబ్బాక ప్రజలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. గురువారం ఆయన చేగుంటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత బీజేపీకి ఓటు వేసి ఉపాధి కల్పించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. కలిసికట్టుగా పని చేసి వకీల్‌సాబ్‌ను అసెంబ్లీకి పంపించాలన్నారు.

సీఎం సీఎం అంటూ నినాదాలు...

పవన్ కల్యాణ్ ఈ రోజు కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తెలంగాణ యువత 'సీఎం.. సీఎం' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సూర్యాపేటలో ఆయన వాహనం పైనుంచి మాట్లాడుతున్న సమయంలో పెద్ద ఎత్తున 'ముఖ్యమంత్రి' అంటూ నినాదాలు చేశారు. 

Posted

K Kavitha: తెలంగాణ రాకముందు నిజామాబాద్ పరిస్థితి ఎలా ఉండేది?: రోడ్డు షోలో కవిత 

24-11-2023 Fri 16:22 | Telangana
  • కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నగరంలో అన్ని సౌకర్యాలు వచ్చాయన్న కవిత
  • అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శలు
  • మానవతా దృక్పథంతో పని చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి
 
BRS MLC Kavitha road show in Nizamabad

తెలంగాణ రాకముందు నిజామాబాద్ నగరంలో దయనీయ పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో ఆమె రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో పేదల సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నిరుపేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని కవిత పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు.

పేదలకు ఎంతో ఉపయోగపడే మేనిఫెస్టోను తాము తయారు చేశామన్నారు. కేసీఆర్ ఏదైనా చెప్పారంటే తప్పకుండా చేసి చూపిస్తారన్నారు. కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక్కటే మైనార్టీ పాఠశాల ఉండేదని, ఇప్పుడు జిల్లాలో 23 మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో పని చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని కోరారు. గత పదేళ్లలో తెలంగాణలో ఎక్కడ కూడా మత ఘర్షణలు జరగలేదని, రానున్న ఐదేళ్లలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్‎లో 3200 ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. 

 

Posted

KCR: తెలంగాణను మోసం చేసిందే కాంగ్రెస్!: కేసీఆర్ 

24-11-2023 Fri 15:03 | Telangana
  • అయిదేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచన
  • అభ్యర్థులు, పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలన్న కేసీఆర్
  • బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని వ్యాఖ్య 
 
KCR interesting comments on Congress leaders

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ వాళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, తనను గెలిపిస్తే.... ఎన్నికలయ్యాక బీఆర్ఎస్‌లో చేరుతామని ఆ పార్టీ అభ్యర్థులు చెబుతున్నారట.. కానీ అదంతా ఝూటా ముచ్చట (అబద్దం) అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ... తనను గెలిపిస్తే బీఆర్ఎస్‌లో చేరుతానని ఇక్కడ నాయకుడు కూడా చెబుతున్నాడట.. నాకు వార్త వచ్చింది... కానీ అదేం లేదు, అంతా అబద్ధమని సభికులను ఉద్దేశించి చెప్పారు. మీ వద్ద కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే మీ వాడకట్టుకో పేకాట క్లబ్ వస్తుందని, అప్పుడు మంచిర్యాల మొత్తం పేకాట క్లబ్బులు తయారవుతాయని హెచ్చరించారు. అప్పుడు ఇళ్లు అమ్ముకొని పేకాటలో పెట్టాల్సి వస్తుందని, జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. 

అయిదేళ్ల భవిష్యత్తు బాగుపడాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు ఉండేవని ఆరోపించారు. గోదావరి మన ఒడ్డునే ఉన్నా కాంగ్రెస్ పార్టీ నీళ్లివ్వలేకపోయిందని విమర్శించారు. 1969లో కాంగ్రెస్ నాలుగు వందల మంది ఉద్యమకారులను కాల్చి చంపిందని, మలి దశ ఉద్యమంలో టీఆర్ఎస్‌ను చీల్చే ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు.

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని కొట్లాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ పెంచుతామన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని, రైతుబంధు కూడా పెంచుతామన్నారు. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆగం కావొద్దని, పార్టీలు, అభ్యర్థుల చరిత్ర చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మోసం చేసిందే కాంగ్రెస్ అని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని వ్యాఖ్యానించారు.

  • Upvote 2
Posted

KTR: సమర్థవంతంగా పని చేసేందుకు ఆరున్నర సంవత్సరాల సమయం మాత్రమే దొరికింది: కేటీఆర్ 

24-11-2023 Fri 14:08 | Telangana
  • తమకు తెలంగాణపై చచ్చేంత మమకారముందన్న కేటీఆర్
  • మా హయాంలో ఐటీ, వ్యవసాయం పెరిగింది.. అవతలివాళ్లు అరవై ఏళ్లు ఏం చేశారని నిలదీత
  • హైదరాబాద్ అభివృద్ధిపై కొన్ని ఆలోచనలు ఉన్నాయన్న మంత్రి కేటీఆర్
 
KTR interesting comments on brs ruling

తమకు అహంకారం లేదని.. తెలంగాణపై చచ్చేంత మమకారం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రతిపక్షాలు తెరపైకి తీసుకు వస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన రియల్ ఎస్టేట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ... తమకు సమర్థవంతంగా పని చేసేందుకు ఆరున్నర సంవత్సరాలు మాత్రమే సమయం దొరికిందన్నారు. కానీ అవతలి వాళ్లు అరవై ఏళ్ళు పాలించి చేసిందేమీ లేదని విమర్శించారు.

తమ హయాంలో ఐటీ పెరిగిందని.. వ్యవసాయం ఉత్పత్తి పెరిగిందని గుర్తు చేశారు. ఓ వైపు పరిశ్రమలు పెరుగుతున్నాయని... మరోవైపు పచ్చదనం అదేస్థాయిలో పెరుగుతోందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక నిరక్షరాస్యత లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పు తీసుకొని ఇల్లు కొంటున్న మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తరఫున సహకారంపై కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయని, వాటిని అమలు చేస్తామన్నారు.

ప్రధాన రోడ్లలో సైకిల్ ట్రాక్, మెట్రో రైలు స్టేషన్ల నుంచి షటిల్ సర్వీసులు, మరిన్ని పార్కులు, గ్రీనరీని అభివృద్ధి చేస్తామన్నారు. కాలుష్యం తగ్గించేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తామన్నారు. 24 గంటల నిరంతర నీటి సరఫరా, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రానున్న అయిదేళ్లలో మెట్రోని 250 కిలో మీటర్ల మేర విస్తరిస్తున్నామని, మెట్రోను డబుల్ డెక్కర్ చేయాలనే ఆలోచన కూడా ఉందన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో తీసుకురావాలనే ఆలోచన ఉందన్నారు.

  • Upvote 2
Posted

KCR: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ రద్దు! 

24-11-2023 Fri 10:07 | Telangana
  • మరో 5 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రచార పర్వం
  • రేపు పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ జరగాల్సిన వైనం
  • రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన
 
KCR Secunderabad sabha cancelled

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజల సమయం కూడా లేదు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో, ప్రధాన పార్టీల నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జాతీయ పార్టీల అగ్రనేతలు సైతం వరుస సభలను నిర్వహిస్తున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ విషయానికి వస్తే... రోజుకు మూడు, నాలుగు సభలతో ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. మరోవైపు, రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ భారీ బహిరంగసభ జరగాల్సి ఉంది. అయితే, ఈ సభ రద్దయింది. రేపు, ఎల్లుండి హైదరాబాద్ తో పాటు తెలంగాణకు వర్షసూచన ఉంది. వర్షాల నేపథ్యంలో సభను రద్దు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. 

 

Posted

Jairam Ramesh: బీఆర్ఎస్ కారు మ్యూజియంలో ఉండాల్సిన సమయం వచ్చింది: జైరాం రమేశ్ 

24-11-2023 Fri 14:32 | Telangana
  • రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కాంగ్రెస్ వైపు ఉన్నారన్న జైరాం రమేశ్
  • పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు ఒక్క బీఆర్ఎస్ ఎంపీ కూడా లేరన్న కాంగ్రెస్ నేత
  • హైదరాబాద్‌కు అనేక పరిశ్రమలు, ఐటీ రంగాన్ని తీసుకు వచ్చింది కాంగ్రెస్ అని వ్యాఖ్య
  • కేసీఆర్ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదని విమర్శలు
  • విభజన తర్వాత కేసీఆర్ కుటుంబానికే న్యాయం జరిగిందని చురకలు
 
Jairam Ramesh satires on brs symbol car

బీఆర్ఎస్ అంబాసిడర్ కారు అని, అది మ్యూజియంలో ఉండాల్సిన రోజు వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోనూ సాగిందని, ఈ యాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ బీ టీమ్ అయితే, మజ్లిస్ సీ టీమ్ అని ఆరోపించారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ లేరని గుర్తు చేశారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. అప్పుడు థ్యాంక్స్ చెప్పి, ఇప్పుడు తెలంగాణ ద్రోహి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాండ్ తెలంగాణ అని కేటీఆర్ చెబుతున్నారని, కానీ అనేక పరిశ్రమలతో పాటు ఐటీ రంగాన్ని కాంగ్రెస్సే తీసుకు వచ్చిందన్నారు.

పెట్టుబడులన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించలేదని ఆయన అన్నారు. పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ఏర్పడటానికి కారణాల్లో ఒకటైన ఉద్యోగాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నోటిఫికేషన్లు పరీక్షలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగంతో రాష్ట్రంలో రోజుకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించారు. పదేళ్ల తెలంగాణలో కేవలం నిరుద్యోగుల ఆత్మహత్యలే ఉన్నాయన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల నిరుద్యోగులు నష్టపోయారన్నారు.

సీఎం కేసీఆర్ గత తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదని, తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కూతురు, ముఖ్యమంత్రి మేనల్లుడు.. అందరికీ పదవులే అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ కుటుంబానికి న్యాయం జరిగిందని, కానీ పేదలకు, దళితులకు అన్యాయమే జరిగిందన్నారు. బీఆర్ఎస్ గుర్తు కారు.. ఆ కారు అంబాసిడర్... అది మ్యూజియంలో ఉండాల్సిన రోజు వచ్చిందని ఎద్దేవా చేశారు.

Posted

KTR: రాబోయే రోజుల్లో ‘స్కాంగ్రెస్’ నుంచి మరిన్ని డీప్ ఫేక్ వీడియోలు వస్తాయి: కేటీఆర్ 

24-11-2023 Fri 10:01 | Telangana
  • కేటీఆర్ ఫోన్ కాల్ పేరిట ఆడియో రికార్డింగ్‌ను షేర్ చేసిన కాంగ్రెస్
  • ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటూ నేతలను కేటీఆర్ కోరినట్టున్న ఆడియో వైరల్
  • తాజాగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసిన మంత్రి కేటీఆర్
  • ఈ ఉచ్చులో ఓటర్లు పడకుండా చూడాలని సూచన
 
KTR alerts party cadre over deep fake propaganda videos

రాబోయే రోజుల్లో  స్కాంగ్రెస్ నుంచి మరిన్ని డీప్ ఫేక్ వీడియోలు రాబోతున్నాయని బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఓటర్లు ఈ ఉచ్చులో పడకుండా చూడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచన. ఈ మేరకు శ్రేణులను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో స్కాంగ్రెస్ నుంచి అర్థరహిత ప్రొపగాండా పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. 

సిరిసిల్లలో ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటూ కేటీఆర్ అక్కడి పార్టీ శ్రేణులకు హితబోధ చేసినట్టు చెబుతున్న ఫోన్ కాల్ ఆడియోను కాంగ్రెస్ నెట్టింట షేర్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ మెజారిటీ తగ్గుతుందని నేతలు మాట్లాడడం భావ్యం కాదని కేటీఆర్ అన్నట్టు ఆడియోలో ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. 

 
 
  • Upvote 2
Posted

Revanth Reddy: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హక్కులను ఈసీ కాపాడాలి: రేవంత్ రెడ్డి విజ్ఞప్తి 

24-11-2023 Fri 13:49 | Telangana
  • ప్రజల తరఫున పోరాడేవారు ద్రోహులు అవుతారా? అని రేవంత్ రెడ్డి ఆగ్రహం
  • వివేక్ కుటుంబంపై జరిగిన ఐటీ దాడిని కాంగ్రెస్ మీద జరిగిన దాడిగా భావిస్తామన్న టీపీసీసీ చీఫ్
  • కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరిగేకొద్దీ ఐటీ, ఈడీ దాడులు పెరుగుతున్నాయని విమర్శలు
 
Revanth Reddy open letter to telangana people

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హక్కులను ఈసీ కాపాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల తరఫున పోరాడేవారు ద్రోహులు అవుతారా? బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో చేరినవారు పవిత్రులు అవుతారా? అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లుగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వివేక్ వెంకటస్వామి కుటుంబం సహా కాంగ్రెస్ నాయకుల ఇళ్ళు, కార్యాలయాలలో జరిగిన ఐటీ దాడులను తాము కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగబద్ద సంస్థలను ప్రధాని నరేంద్రమోదీ, కేసీఆర్ పావులుగా ఉపయోగించుకుంటున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు పెరిగేకొద్దీ ఐటీ, ఈడీ దాడులు పెరుగుతున్నాయన్నారు. ప్రశ్నించే గొంతులే మిగలకూడదనేది బీజేపీ - బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఎద్దేవా చేశారు. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడి నుంచి అందుతున్నాయని ప్రశ్నించారు. గడిచిన పదేళ్లలో మోదీ, అమిత్ షా ఆదేశాలు లేకుండా... విచారణ సంస్థల్లో చీమ చిటుక్కుమనలేదన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరు ఉన్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు.

Posted

Barrelakka: ఎవరీ బర్రెలక్క.. రాష్ట్రంతో పాటు దేశమంతటా ఒకటే చర్చ! 

24-11-2023 Fri 10:55 | Telangana
  • కొల్లాపూర్ నుంచి అసెంబ్లీ బరిలో బర్రెలక్క
  • నిరుద్యోగుల గొంతుకగా నామినేషన్ దాఖలు
  • బెదిరింపులకు బయపడేది లేదంటున్న వైనం
  • ప్రాణం పోయినా పోరాటం ఆపబోనని శిరీష వెల్లడి
 
Kollapur Indipendent candidate barrelakka

సోషల్ మీడియాలో బర్రెలక్కగా ఫేమస్ అయిన కర్నె శిరీష (26) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వతంత్ర్య అభ్యర్థిగా కొల్లాపూర్ సెగ్మెంట్ లో నామినేషన్ వేసిన శిరీషకు మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో మిగతా అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. నిరుద్యోగుల గొంతుకగా ఎన్నికల్లో పోటీచేస్తున్న బర్రెలక్కకు బెదిరింపులు మొదలయ్యాయి. ప్రచారంలో ఆమెపై, ఆమె సోదరుడిపై దాడి జరిగింది. పోటీ నుంచి తప్పుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆఫర్లు వస్తున్నాయి. 

అయితే, ఈ ప్రలోభాలకు, బెదిరింపులకు, దాడులకు తాను భయపడబోనని బర్రెలక్క తేల్చి చెప్పింది. ప్రాణం పోయినా సరే పోరాటం ఆపబోనని స్పష్టం చేసింది. బర్రెలక్కపై దాడి జరగడంతో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బర్రెలక్కకు ఓటు వేసి గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాసంఘాల నేతలు, మేధావులు, ప్రజలు బర్రెలక్కకు అండగా నిలుస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆమె తరఫున ప్రచారం చేస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కొల్లాపూర్ బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

శిరీష.. బర్రెలక్కగా ఎలా అయిందంటే..
కర్నె శిరీషది నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం.. తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో కూడిన నిరుపేద కుటుంబం. తండ్రి వీరిని వదిలేసి వెళ్లాడు. దీంతో శిరీష తల్లి రోజు కూలీగా మారి కుటుంబాన్ని గెంటుకొస్తోంది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూనే కుటుంబానికి ఆసరగా ఉండేందుకు శిరీష కూడా కూలీ పనులకు వెళ్లేది. తల్లిని అడిగి నాలుగు బర్రెలను కొని, వాటి పాలు అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు తనలాంటి నిరుద్యోగుల ఆవేదనను జనాలందరికీ తెలిసేలా ఓ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇన్ స్టాలో సంచలనం సృష్టించింది. దేశవిదేశాల్లోని ఇన్ స్టా యూజర్లకు ఆమెను పరిచయం చేసింది. కర్నె శిరీషను బర్రెలక్కగా మార్చేసింది. వీడియో వైరల్ కావడం కొందరికి కంటగింపుగా మారింది. ఫలితంగా శిరీషపై కక్ష సాధింపునకు దిగారు. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాని కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం శిరీషకు ఇన్ స్టాలో 5.73 లక్షల మంది, ఫేస్ బుక్ లో 1.07 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్ లో 1.59 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

ప్రభుత్వ తీరుతో ఎన్నికల బరిలోకి..
వేధింపులపై ధైర్యంగా పోరాడుతున్న శిరీష అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. చేతిలో డబ్బులేకున్నా నిరుద్యోగుల గొంతుకగా నామినేషన్ వేసింది. అఫిడవిట్ లో ఆమె ఆస్తుల వివరాలు.. బ్యాంక్ ఖాతాలో రూ.1,500, చేతిలో రూ.5 వేలు ఉన్నట్లు వెల్లడించింది. తనకు సపోర్ట్ చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది. కొంతమంది నేరుగా ప్రచారానికి వస్తుండగా ఇంకొంత మంది తమకు తోచిన నగదు సాయం చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఆమెకు మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. ప్రచారం కోసం డబ్బు సాయం, పాటలు రాసివ్వడం.. ఇలా ఏదో ఒక రకంగా మేధావులు మద్దతు తెలుపుతున్నారు.

పోటీ పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వం మనకెందుకు?
ఒక్కటంటే ఒక్క నియామక పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకంటూ బర్రెలక్క సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది తన సొంత నిర్ణయమని స్పష్టత నిచ్చారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, అప్పులు చేసి హైదరాబాద్ కు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారని చెప్పారు. తిండి లేకున్నా తిప్పలు పడుతూ కష్టపడి చదువుకుంటున్నారని, వారి బాధలు చెప్పడానికి మాటలు చాలవని శిరీష వివరించారు. పరీక్షలు సరిగా రాయకుంటే ఫెయిల్ చేస్తారు.. మరి పరీక్షలే సక్కగా పెట్టలేని ఈ ప్రభుత్వాలను ఏంచేయాలని ప్రశ్నించారు. ప్రచారంలో ప్రజల నుంచి తనకు బాగా సపోర్ట్ అందుతోందని శిరీష చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా నిరుద్యోగ సోదరులు వచ్చి తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారని వివరించారు. ‘బర్రెలక్క ఒక్కతే పోటీ చేస్తే ఏం జరగదు. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగుల సమస్య. నిరుద్యోగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎన్నికల్లో పోటీ చేయాలె. వాళ్ల ఇంటి నుంచే పోరాటం మొదలు కావాలె” అని శిరీష పిలుపునిచ్చా రు.

చంపుతామని బెదిరింపులు..
ఓ సామాన్య నిరుద్యోగి ఎన్నికల బరిలో నిలబడితే ఎందుకంత భయపడుతున్నారని ప్రధాన పార్టీల అభ్యర్థులను శిరీష నిలదీశారు. పోటీ నుంచి తప్పుకోకుంటే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, పొలిటికల్ పార్టీల లీడర్లు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎలక్షన్ల ముందు కుక్కకు బొక్క వేసినట్లు ఆశ చూపించడం కాకుండా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల వివరాలను వెల్లడించాలని శిరీష డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ వేసి, పారదర్శకంగా నియామకాలు జరపాలని, ఇదే తన మేనిఫెస్టో అని చెప్పారు. నామినేషన్ వేసినప్పటి నుంచి వేధింపులు మరింత పెరిగాయని తెలిపారు. ఫోన్లలో బెదిరింపులు, బూతులతో తిడుతున్నారు.. వారందరి వివరాలు జాగ్రత్త చేస్తున్నానని శిరీష చెప్పారు. ఎన్నికల తర్వాత వారి వివరాలు మీడియాకు వెల్లడిస్తానని శిరీష పేర్కొన్నారు.

Posted

Vivek Venkataswamy: అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు: వివేక్ వెంకటస్వామి 

24-11-2023 Fri 08:48 | Telangana
  • రూ.200 కోట్ల లావాదేవీలు జరిపానంటూ ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • భూముల వ్యవహారంలో ఈటల రాజేందర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్న
  • 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్‌కు ఆర్థిక సహాయం చేశానని ప్రస్తావన
  • మంచిర్యాల జిల్లా భీమారం ఎన్నికల ప్రచారంలో వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
 
Vivek Venkataswamy fires on BJP and BRS in election campaign

బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాక తనపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతుండడంపై చెన్నూరు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఘాటుగా స్పందించారు. కేసీఆర్‌, అమిత్‌ షా సారధ్యంలోనే తనపై ఈడీ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. బీజేపీలో ఉన్నప్పుడు సీతలా, కాంగ్రెస్‌లో చేరాక రావణుడిలా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని, అందుకే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి కేసులకు ఎవరూ భయపడొద్దని వివేక్ వెంకటస్వామి అన్నారు.

హుజూరాబాద్‌, మునుగోడు ఉపఎన్నికల సమయంలో బీజేపీ నేత ఈటల రాజేందర్‌ భూములకు సంబంధించి ఆయనకు రూ.27 కోట్లు ఇచ్చానని, ఇందుకు సంబంధించిన లావాదేవీలు చట్టప్రకారం జరిగినా తనకు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. తన మిత్రుడు యశ్వంత్‌ రెడ్డికి చెందిన రూ.20 లక్షల విలువగల కంపెనీ రూ.200 కోట్ల లావాదేవీలు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. ఆ ఆరోపణలకు, తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. ఇటీవలే తన కంపెనీలో షేర్ల అమ్మకం ద్వారా రూ.50 కోట్ల లాభం వచ్చిందని, అందులో రూ.9 కోట్లు పన్నులుగా చెల్లించానని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్‌కు తాను ఆర్థిక సహాయం చేశానని, అలాంటి వ్యక్తి నేడు రూ.వేల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లిలో గురువారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 

 

  • Haha 2

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...