Jump to content

Carelessness - Disturbing


Anta Assamey

Recommended Posts

గోలీల తారుమారు 

 

నాంపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం 
32 మంది శిశువులకు తీవ్ర అస్వస్థత.. ఒకరి మృతి 
విచారణకు ఆదేశించిన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు 
ఈనాడు, హైదరాబాద్‌: న్యూస్‌టుడే, రెడ్‌హిల్స్‌, నాంపల్లి

hyd-main1a_20.jpg

వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం.. బాధ్యతారాహిత్యం.. ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. శిశువులకు వ్యాక్సిన్‌ వేసిన సిబ్బంది ఆ తర్వాత జ్వరం, నొప్పి తగ్గడానికి ఇచ్చే మాత్రలకు బదులు మరో మందు గోలీలు ఇవ్వడంతో కిషన్‌బాగ్‌కు చెందిన రెండు నెలల ఫయాజ్‌ అనే చిన్నారి మృతిచెందగా.. మరో 31 మంది శిశువులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. నాంపల్లిలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం దాదాపు 92 మంది చిన్నారులకు వైద్య సిబ్బంది టీకాలు వేశారు. చిన్నారులంతా 2-3 నెలల్లోపు వారే. టీకా అనంతరం పిల్లలకు జ్వరం, నొప్పి తగ్గడానికి పారాసెటమాల్‌ ఉపయోగిస్తారు. ఇక్కడి సిబ్బంది పారాసెటమాల్‌ మాత్రలకు బదులు ట్రమడాల్‌ అనే మరోరకం మందుబిళ్లలను ఇచ్చి పంపారు. ఇంటికి వెళ్లిన తర్వాత పలువురు శిశువులకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సిబ్బంది ఇచ్చిన మాత్ర (ట్రమడాల్‌) వేశారు. కొద్దిసేపటికే పిల్లల ఆరోగ్యం విషమించింది.  కంగారుపడ్డ తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తీసుకెళ్లారు. వారు నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బుధవారం అర్ధరాత్రి వరకు దాదాపు 15 మంది శిశువులను నిలోఫర్‌కు తీసుకువచ్చారు. గురువారం ఉదయం మరికొందరిని తీసుకురావడంతో మొత్తం నిలోఫర్‌లో చేరిన చిన్నారుల సంఖ్య 31కి చేరింది. ఆసుపత్రికి చేర్చేలోపే ఒకరు మృతి చెందారు. క్లిష్టంగా ఉన్న ముగ్గురిని ప్రత్యేకంగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అప్పుడే చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. మిగతావారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 
ఇంత నిర్లక్ష్యమా? 
ప్రతి బుధవారం అర్బన్‌ వైద్య కేంద్రాల్లో చిన్నారులకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంటారు. టీకా తర్వాత కొంతసేపటికి పిల్లలకు జ్వరం రావడంతోపాటు నొప్పి ఉంటుంది. అది తగ్గడానికి పారాసెటమాల్‌ గోలీలు ఇస్తుంటారు. ఇక్కడే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాస్తవానికి ప్రతి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు పారాసెటమాల్‌ మాత్రలు, సిరప్‌ కూడా సరఫరా చేస్తున్నారు. ఇక్కడి సిబ్బంది మాత్రం గోలీలు మాత్రమే ఇచ్చారు. అదీకాకుండా ఈ మందుల స్ట్రిప్‌లు ఒకే రంగులో ఉండటంతో పారాసెటమాల్‌ బదులు ట్రమడాల్‌ ఇచ్చేశారు. వ్యాక్సినేషన్‌ సమయంలో వైద్యులు డాక్టర్‌ రుబీనా, పార్మాసిస్టు మెహన్‌, నర్సులు మెహ్రా అక్కడే ఉన్నట్లు సమాచారం. అందరూ ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్న వారే కావడం గమనార్హం. 
మిగతావారి పరిస్థితి ఏమిటి? 
నాంపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం మొత్తం 92 మంది చిన్నారులకు టీకాలు వేశారు. వారిలో 32 మంది అస్వస్థతకు గురవడంతో నిలోఫర్‌కు తీసుకువచ్చారు. మిగతా 60 మంది పరిస్థితి ఏమిటి అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 
ట్రమడాల్‌ ఎందుకు వాడతారు? 
సాధారణంగా ట్రమడాల్‌ మందును పెద్దలకు వెన్నునొప్పి, కీళ్ల నొప్పులకు లేదా ఆపరేషన్‌ చేసిన తరువాత నొప్పి తగ్గడానికి ఇస్తుంటారు. ఆరోగ్య కేంద్రం సిబ్బంది పిల్లల తల్లిదండ్రులకు ఈ మాత్రలు అందజేసి నాలుగోవంతు మాత్రను వాడాలని చెప్పారు. అది వేయగానే పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. 
గతంలో సిరిసిల్లలోనూ ఒకరి మృతి 
ఏడాది క్రితం సిరిసిల్లలో కూడా టీకాల అనంతరం ఇలాగే ట్రమడాల్‌ మాత్ర ఇవ్వడంతో ఒక శిశువు మృతి చెందగా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రత్యేక వైద్య నిపుణుల కమిటీని నియమించారు. పారాసెటమాల్‌ను మాత్రలుగా కాకుండా సిరప్‌ (ద్రావణం) లేదంటే చుక్కల మందు రూపంలో ఇస్తే బాగుంటుందని కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ సిఫార్సులు ఇంతవరకు అమలుకాలేదు. 
ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. 
ఇంతమంది చిన్నారులు అస్వస్థతకు గురవడంతో నిలోఫర్‌ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి అర్బన్‌ వైద్య కేంద్రం వద్ద కూడా పోలీసులు మోహరించారు. పిల్లల అస్వస్థత గురించి తెలియగానే డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని చిన్నారుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులైన సిబ్బందిని ఉన్నతాధికారులు పిలిపించి విచారణ చేస్తున్నారు.

ట్రమడాల్‌ మందు వల్లే అస్వస్థత 

ట్రమడాల్‌ మందు పిల్లల ఊపిరితిత్తులు, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కనీసం 24 నుంచి 48 గంటల పాటు మగతగా ఉంటుంది. ట్రమడాల్‌ విరుగుడు కోసం దాదాపు వంద డోసుల ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాం. చిన్నారులందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నాం. 

-డాక్టర్‌ మురళీకృష్ణ, సూపరింటెండెంట్‌, నిలోఫర్‌ 

బాధ్యులపై కఠిన చర్యలు  
విచారణకు ఉన్నత స్థాయి కమిటీ: మంత్రి ఈటల  
ట్రమడాల్‌ మాత్ర ఉపసంహరణకు ఆదేశం 

hyd-main1b_10.jpg

ఈనాడు, హైదరాబాద్‌: నాంపల్లి ఆరోగ్య కేంద్రంలో టీకాల అనంతరం ఒక మాత్రకు బదులు మరో మాత్ర ఇచ్చి చిన్నారుల అస్వస్థతకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే ఆయన నిలోఫర్‌ ఆసుపత్రిని సందర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులతో మంత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 92 మంది చిన్నారులకు బుధవారం టీకాలివ్వగా వీరిలో అత్యధికుల సమాచారాన్ని అసలు ఆరోగ్య సిబ్బంది నమోదు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. నిలోఫర్‌ ఆసుపత్రికి రాని మిగతావారి పరిస్థితి ఏమిటో తెలుసుకునే అవకాశమే లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ఆ పిల్లలెవరో, వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని ఆదేశించారు. పారాసెటమాల్‌ మాత్ర స్ట్రిప్‌ను పోలినట్లుగా ఉన్న ట్రమడాల్‌ మాత్ర స్ట్రిప్‌ను తక్షణమే ఉపసంహరించాలని మంత్రి ఆదేశించారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...